సీఆర్‌డీఏ, ఫైబర్ నెట్ అవినీతిపై సిబిఐ దర్యాప్తు?

చంద్రబాబు నాయుడు హయాంలో సీఆర్‌డీఏ పరిధిలో వేలాది ఎకరాల భూకుంభకోణం జరిగిందని,  రికార్డులు కూడా తారుమారు చేశారని వెల్లడవడంతో ఈ వ్యవహారంపై నిజాలను నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణ కోరేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు సంసిద్ధమయ్యారు.

ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌)లో కూడా అంతులేని అవినీతి చోటుచేసుకుందని తెలియడంతో ఈ బాగోతంపైనా సీబీఐ దర్యాప్తు కోరాలని పార్టీ ఎంపీలు నిర్ణయించినట్టు తెలిసింది.

ఈ రెండు కుంభకోణాలపై గతంలోనే వైఎస్సార్‌సీపీ సీబీఐ దర్యాప్తు కోరినా, నెలల తరబడి కేంద్రం పెండింగ్‌లో పెట్టడంతో ఈ పార్లమెంటు సమావేశాల్లో దానిపై గట్టిగా నిలదీయాలని పార్టీ ఎంపీలు నిర్ణయించినట్టు చెబుతున్నారు.

 గతంలో రాజధాని పరిధిలో చోటుచేసుకున్న భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్‌ స్కామ్‌ సాధారాణ కుంభకోణాలు కావని, చంద్రబాబుకు సన్నిహితులైన వారు ఎందరో వాటి వెనక ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీలు విస్పష్టంగా పేర్కొంటున్నారు. 

సీబీఐ దర్యాప్తు చేపడితే ఈ కుంభకోణాల వెనుక పెద్దల హస్తం బయటపడుతుందని నిజానిజాలు వెలుగుచూస్తాయని భావిస్తున్నారు. ఉన్నతస్ధాయి విచారణతోనే చంద్రబాబు బాగోతం వెలుగుచూస్తుందని వారు చెబుతున్నారు.