వచ్చే ఏడాది తొలినాళ్లలో వాక్సిన్

వచ్చే ఏడాది మొదటి మూడు నెలలలోగానే మన దేశంలో వాక్సిన్ రావడం తథ్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. వాక్సిన్ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా వాటిని తీర్చి వాక్సిన్ సురక్షితం అనే విషయాన్ని రుజువు చేసేందుకు తాను ముందుగా వాక్సిన్ తీసుకునేందుకు సిద్ధపడతానని ఆయన ప్రకటించారు.

అంతే గాక వాక్సీన్ను అత్యవసర వినియోగానికి విడుదల చేసే విషయంలో ఏకాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తానని కేంద్ర మంత్రి చెప్పారు. మన దేశంలో వాక్సిన్ ట్రయల్స్ అన్ని ప్రమాణాలతో పటిష్టంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. వాక్సిన్ వచ్చిన తర్వాత మొదటగా ఎవరికి ఇవ్వాలి, పంపిణీ ఏ ప్రాతిపదికన చేయాలి అనే విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైన విధానాలు రూపొందించుకుని సిద్ధంగా ఉందని తెలిపారు.

ముందుగా వాక్సిన్ ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు, సీనియర్ సిటిజన్లకు,ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఇస్తామని చెప్పారు. కోవిడ్ చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడానికి నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

వ్యాక్సిన్ యొక్క మానవ పరీక్షలను నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. వ్యాక్సిన్ భద్రత, ఖర్చు, ఈక్విటీ, కోల్డ్-చైన్ అవసరాలు, ఉత్పత్తి సమయపాలన మొదలైనవి కూడా తీవ్రంగా చర్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసులు ప్రతిరోజూ 90,000 కన్నా ఎక్కువ పెరుగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా 50 లక్షల సంఖ్యకు భారత్ వేగంగా సమీపిస్తున్నది.