కశ్మీర్ లో ఇద్దరు జైషే ఉగ్రవాదులు అరెస్ట్

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఇద్దరు జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వర్తించడానికి, యువతను ఉగ్రవాద సంస్థలో చేర్చుకోవడానికి సోపోర్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు జైషే ఉగ్రవాదులు కుప్వారాలో పర్యటించనున్నారని పోలీసులకు సమాచారం అందింది. 
 
దీంతో అలర్టైన పోలీసులు, 47 రాష్టీయ్ర రైఫిల్స్‌ బలగాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి. ఇందులో బాగంగా కుప్వారాలోని ద్రుగ్‌ముల్లా సమీపంలో ఉన్నఎఫ్‌సీఐ గోదాం దగ్గర కారును తనిఖీ చేశారు. 
 
అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు జైషే ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిని సోపార్లోని అరంపోరాకు చెందిన వసీమ్‌ ఇర్షాద్‌ గబ్రూ (23), బాద్‌షాకు చెందిన మెహ్రాజుద్దీన్‌ వణీగా (21)గా గుర్తించారు. 
 
వారి దగ్గర నుంచి రూ.7 లక్షల నగదు, ఏకే-47 రైఫిల్‌, మ్యాగజైన్‌, రెండు గ్రనేడ్లు, 30 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసకున్నారు.