గుంటూరులో బీజేపీ, జనసేన నిరసన

రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు పిలుపుమేరకు గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ, జనసేన నిరసన ప్రదర్శన చేపట్టారు. హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు అన్నింటిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతామని రెండు పార్టీలకు చెందిన నేతలు హెచ్చరించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించామని చెబుతోందని, దానిపై నిబద్ధత కలిగి ఉండాలని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఇప్పటి వరకు హిందూ దేవాలయాలపై జరిగిన దాడులన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎక్కడ ఏదీ జరిగినా ప్రభుత్వం రెడీమేడ్ సమాధానం చెబుతోందని విమర్శించారు.

అంతర్వేదిలో తేనెటీగల కోసం పొగ పెడితే రథం తగలబడిందని ప్రభుత్వం చెబుతోందని, ఇది నమ్మసక్యంగా లేదని అందరికీ అర్థమవుతోందని పేర్కొన్నారు. అంతర్వేది సంఘటనను పరిశీలించేందుకు వెళ్లిన వీహెచ్‌పీ, భజ్‌రంగ్‌దళ్ నేతలను అరెస్టు చేసి.. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.