కాకినాడలోని ఆటోనగర్ శివారులో విషవాయువులు కలకలం రేపాయి. విషవాయువుల కారణంగా తీవ్ర దుర్గంధం వెలువడడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. వాటి తీవ్రత 200 మీటర్ల వరకు వ్యాపించింది.
కొందరు లారీ డ్రైవర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, పరిశ్రమల అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నమూనాలు సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
కాగా, లీకైన వాయువును ప్రాథమికంగా ప్రమాదకరమైన అమోనియాగా గుర్తించారు. రెండు అగ్నిమాపక శకటాలతో వాయువులపై నీళ్లు చల్లడంతో వాయువు గాఢత తగ్గింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలతో నిండిన పది డ్రమ్ములను విడిచిపెట్టారని, వాటి నుంచే విష వాయువులు వ్యాపించాయని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మే 31న సర్పవరంలో కూడా ఈవిధంగానే విషవాయువులు లీకైన సంగతి తెలిసిందే.

More Stories
హథీరాంజీ మఠాధిపతి సంత్ అర్జున్దాస్కు `సుప్రీం’లో భారీ ఊరట
కాలుష్య రహితంగా ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’
సత్యసాయి జిల్లా జాతీయ రహదారి టెండర్లపై ఫిర్యాదు