రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని మరోసారి కేంద్రం స్పష్టీకరించింది.   రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమంటూ ఇప్పటికే  ఏపీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. 
 
తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత స్పష్టత ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. 
 
రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది. సెక్షన్‌ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదని స్పష్టం చేసింది. 3 రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్‌ దోనే సాంబశివరావువి అపోహలేనని హోంశాఖ కొట్టిపారవేసిది.  
 
2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందని,హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అని కేంద్రం తెలిపింది.   
 
రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని పేర్కొంది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టీకరించింది.