అంతర్వేదిలో పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు

అంతర్వేదిలో చోటు చేసుకున్న ఘటనపై పోలీసులనిదర్యాప్తుపై తనకు నమ్మకం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం స్పందించకుంటే సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రాన్ని కోరతాని వెల్లడించారు. 
 
వరుసగా జరుగుతున్న ఇటువంటి సంఘటనలలో ఉగ్రవాద కోణం ఉంటే ఎన్ఐఏ దృష్టి సారించాలని ఆయన సూచించారు. హిందూ క్షేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని కచ్చితంగా ఆపాలని ఆయన కోరారు. దేవాలయాలు, మత విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు ఏవైనా చాలా సున్నితమైన అంశాలని హెచ్చరించారు. 
 
గత కొద్ది నెలలుగా వరుస క్రమంలో జరిగిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి, వినాయకుడు, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసిన విధానం, విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించి, సింహాచలం మాన్సాస్ ట్రస్ట్‌కి సంబంధించిన వివాదంగానీ, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వస్వామి వారిని తీసుకువెళ్లే రథాన్ని తగులబెట్టేయడం గురించి కచ్చితంగా మాట్లాడాలని స్పష్టం చేశారు. 
 
ఇది ఒక సంఘటనో రెండు సంఘటనలో అయితే చిన్న స్థాయిలో స్పందించి వదిలేసేవాడిని. కానీ వరుస క్రమంలో జరుగుతూ ఉంటే మౌనంగా ఉండలేం’ అని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇవ్వన్నీ ఆలయాలను, ధార్మిక కేంద్రాలను అపవిత్రం చేసే విధానమే అని పవన్ మండిపడ్డారు. 
 
మొన్న పిఠాపురం, కొండబిట్రగుంట. ఇప్పుడు అంతర్వేది ఘటనలు ఇవన్నీ యాదృచ్ఛికాలు కావని స్పష్టం చేశారు. ఎన్ని విగ్రహాల ధ్వంసాలు, రథాల దహనాలు యాధృచ్ఛికంగా జరుగుతాయని చెబుతుంటారని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. 
 
మతిస్థిమితం లేనివారి పని, తేనె పట్టు కోసం చేసిన పని అంటే పిల్లలు కూడా నవ్వుతారని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే సరిగా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశ్వాసాలను దెబ్బతీస్తున్న తీరుపై ఆడపడుచులందరూ మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ తమ నిరసన తెలపాలని పవన్ పిలుపునిచ్చారు. 
 
ఇతర మతాల పెద్దలూ ఈ ఘటనలను ఖండించాలని సూచించారు. ప్రార్ధనా మందిరాలను అంటే ఏ మత ప్రార్ధనా మందిరాలను అయినా సరే ఇలా అపవిత్రం చేస్తే అందరూ ఇబ్బంది లేకుండా మాట్లాడుతారు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించిగానీ, హిందూ మతానికి సంబంధించిగానీ మాట్లాడాలి అంటే మనల్ని మతవాదులు అనేస్తారా..? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. 
 
రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. మానవ హక్కులనేవి ప్రతి ఒక్కరికీ సమానం. ఏ మతానికి కానీ, ఏ కులానికి చెందిన వారైనా అందరికీ సమానంగా ఇచ్చారు. సెక్యులరిజం అంటే అందర్నీ సమానంగా చూడటమే. కొంత మందిని ఎక్కువ సమానంగా చూడమని కాదు కదా. ఈ క్రమంలో మెహర్బానీ రాజకీయాలు ఎక్కువైపోయాయని పవన్ విచారం వ్యక్తం చేశారు.