అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు..  వీఆర్వో వ్యవస్థ రద్దు

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ బిల్లును ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.  ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల పదవుల రద్దు చట్టం- 2020 పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు.

కొత్త రెవెన్యూ బిల్లు ప్రకారం తెలంగాణలో వీఆర్వో పదవులు రద్దవుతాయి. వెంటనే వీఆర్వోలు పదవి విరమణ లేదా రాజీనామా చేయాలని బిల్లులో తెలిపారు. వారిని ఏదైనా ప్రభుత్వ శాఖలోని ఏదైనా సమానమైన శ్రేణిలోకి బదిలీ లేదా విలీనం చేయనున్నారు.

ఈ సందర్భంగా సభలో మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన రోజు ఉన్నంత సంతోషం ఇవాళ ఉందని చెప్పారు. ఈ రోజు చారిత్రాత్మకమైన రోజని చెబుతూ  ఈ బిల్లు ప్రతీ కుటుంబానికి వర్తిస్తుందని తెలిపారు.

రెవెన్యూ బిల్లు ముఖ్యాంశాలు 

  • కొత్త చట్టం వ్యవసాయ యోగ్యమైన భూమి కోసం మాత్రమే వర్తిస్తుంది.
  • పట్టాదారు పాస్ పుస్తకాన్ని హక్కు పత్రముగా పరిగణించాలి.
  • తహశీల్దార్ లకు కు సబ్ రిజిస్ట్రార్ కు ఉండే అధికారాలు అప్పగింత.
  • భూ వివాదాల పరిష్కారాల కోసం ఒక్కరు లేదా అంతకన్నా ఎక్కువ సభ్యులతో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు.
  • ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డును డిజిటల్ స్టోరేజ్ చేయాలి.
  • కొత్త పట్టాదారు పుస్తకానికి హక్కుల రికార్డుగా పరిగణిస్తారు.
  • ఆ రికార్డులో పట్టాదారు పేర్లు- సర్వే నంబర్లు- విస్తీర్ణం ఉంటాయి.
  • ఈ చట్టం కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు.
  • పాయిగా- జాగీరు- సంస్థానాలు- మక్తా- గ్రామ అగ్రహారం-ఉహ్మ్లి- ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం ప్రకారం బదిలీ చేయరాదు.
  • జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి.
  • ఏ రకమైన రిజిస్టేషన్ కోసమైనా ప్రభుత్వం నిర్దేశించిన వెయిబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి.
  • రిజిస్టేషన్ సమయంలో పాస్ పుస్తకం బదిలీ దస్తావేదులు రిజిస్ట్రార్ సమక్షంలో ఇవ్వాలి.
  • ముటేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి.
  • వ్యవసాయ భూముల అమ్మకం కొనుగోలు ముటేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే హక్కుల రికార్డ్ పూర్తి చేసి కొన్నవారికి వెంటనే బదిలీ చేయాలి.
  • ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి.
  • మోసపురితంగా ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేస్తే, రద్దు చేసే అధికారం కలెక్టర్ కు ఉంది
  • పాస్ పుస్తకాన్ని మోసపూరితంగా జారీ చేసిన చేసిన తహశీల్దార్ పై బర్తరఫ్ క్రిమినల్ కేసులు- తిరిగి భూములు స్వాధీనం.
  • కొత్త బిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం-ప్రభుత్వ అధికారి పై ఎటువంటి దావా వేయకూడదు
  • ఇప్పటి వరకు ఎటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయని భూములకు ప్రోజీసర్ ప్రకారం పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం తహశీల్దార్ కు ఉంది.
  • డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలి.
  • రుణాల మంజూరు కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు
  • ఈ చట్టం సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద విచారణకు అర్హత ఉంది.
  • ఈ బిల్లు చట్టరూపం దాల్చగానే పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971 రద్దు అవుతుంది.
  • రికార్డులను అక్రమంగా దిద్దడం- మోసపూర్తిత ఉత్తర్వులు జారీ చేస్తే అధికారులు- ఉద్యోగుల పై క్రిమినల్ చర్యలు- సర్వీస్ నుంచి తొలగింపు బర్తరఫ్ చేస్తారు.
  • 1971 యాక్ట్ రద్దు అయిన నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్- కేసులన్ని కొత్తగా ఏర్పాటు చేసే ప్రత్యేక ట్రిబ్యునల్ కు బదిలీ.
  • విచారణ తరువాత ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఫైనల్.
  • కొత్త చట్టం ఏర్పాటు అయిన తరువాత రూల్స్ రూపొందించాలి.