‘మానసిక స్వస్థత’కు కేంద్రం టోల్‌‌ ఫ్రీ హెల్ప్‌లైన్

మానసిక వైకల్యం కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైకల్యం అధిగమించేందుకు అవసరమైన సూచనలు, సలహాలు, ఇతర సహాయం అందించి.. స్వస్థత చేకూర్చేందుకు ఉచిత ‘మెంటల్ రిహాబిలేషన్’ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. వారంలో 24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. 
 
ఇందుకు సంబంధించిన హైల్ప్‌లైన్ ‘KIRAN’ (1800-599-0019)ను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ సోమవారంనాడు ప్రారంభించారు.
మానసిక వైకల్యం కలిగిన వారికి సాధ్యమైనంత త్వరగా స్క్రీనింగ్ చేయడం, ఫస్ట్ ఎయిడ్, సైకలాజికల్ సపోర్ట్, సానుకూల వైఖరిని పొంపొందించడం వంటివి ఈ హైల్ప్‌లైన్ ప్రధాన లక్ష్యాలు.
ఇదొక లైఫ్‌లైన్ అని, సూచనలు, కౌన్సిలింగ్‌ వంటివి కోరుకున్న 13 భాషల్లో అందివ్వడం జరుగుతుందని గెహ్లాట్ తెలిపారు. మానసిక వైకల్యంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఈ హెల్ప్‌లైన్ ఎంతో సహాయకారిగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ హెల్ప్‌లైన్ ముఖ్యోద్దేశాలను సామాజిక న్యాయం, సాధికారతా శాఖ సంయుక్త కార్యదర్శి ప్రబోధ్ సేథ్ వివరిస్తూ  బీఎస్ఎన్‌ఎల్ సాంకేతిక సమన్వయంతో రోజుకు 24 గంటలు, వారంలో ఏడు రోజులు (24X7) ఈ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.

 660 క్లినికల్ అండ్ రిహాబిలేషన్ సైకాలజిస్టులు, 668 మంది సైకియాట్రిస్టులు సహాయకారిగా ఉంటారని తెలిపారు. హిందీ, అస్సామీ, తమిళం, మరాఠీ, ఒడియా, తెలుగు, మలయాళం, గుజరాతీ, పంజాబీ, కన్నడ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం వంటి 13 భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.

హైల్ప్‌లైన్ పనితీరును సేథ్ మరింత వివరిస్తూ, దేశంలోని ఏ నెట్‌వర్క్ నుంచైనా మొబైల్, ల్యాండ్‌లైన్‌ ద్వారా 1800-599-0019కు డయిల్ చేయాలని, తమకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలని చెప్పారు. ఆ వెనువెంటనే వారి స్వస్థలం లేదా కోరిన రాష్ట్రంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌కు ఫోన్ కనెక్ట్ అవుతుందని తెలిపారు. 

ఫోన్ కాలర్‌కు మెంటల్ హెల్త్ నిపుణులతో కనెక్ట్ కాగనే వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడంతో పాటు, అవసరమైన సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులను రిఫర్ చేస్తారని చెప్పారు.