ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్‌

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశారు. 
 
తన తండ్రికి కరోనా నెగిటివ్‌ అని వచ్చినప్పటికీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా మెరగవ్వలేదని చరణ్‌ తెలిపారు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగవ్వడంతో వెంటిలేటర్‌ తొలగిస్తామని భావించామని, అయితే ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారని చెప్పారు. 
 
ఊపరితిత్తులలో ఇంకా ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా తొలగిపోలేదని తెలిపారు. అయితే గతం కంటే నాన్న మెరుగ్గా ఉన్నారని, ఐపాడ్‌లో క్రికెట్‌, టెన్నిస్‌ చూస్తున్నారని, ఐపిఎల్‌ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని ఎస్పీ చరణ్‌ చెప్పారు. 
 
`నాన్న ప్రస్తుతం ఐపాడ్‌లో క్రికెట్, టెన్నిస్ కూడా చూస్తూ ఆస్వాదిస్తున్నారు. చేతితో రాయగలుగుతున్నారు. అంతేకాదు.. చక్కగా భావవ్యక్తీకరణ కూడా చేయగలుగుతున్నారు. ఊపిరితిత్తులు పూర్తిగా బాగుపడడంపైనే దృష్టి సారించాము’ అని ఎస్పీ చరణ్ వీడియోలో వివరించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  `
 
కరోనా పోరాడుతూ అగస్టు 5వ తేదీన ఎస్పీ బాలు చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మోసాయంతో చికిత్స అందిస్తున్నారు.