చైనాకు మింగుడు పడని తైవాన్ కొత్త పాస్‌పోర్టు

తైవాన్ కొత్త పాస్‌పోర్టులను జారీ చేయాలని ప్రయత్నించడం చైనాకు మింగుడు పడటం లేదు. ఈ పాస్‌పోర్టుల ద్వారా తన సొంత గుర్తింపును చాటుకుంటూ, చైనాకు ప్రాధాన్యాన్ని తగ్గించాలని నిర్ణయించింది.   

తైవాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం కొత్త పాస్‌పోర్టు నమూనాను విడుదల చేసింది. దీనిలో ‘తైవాన్’ అనే అక్షరాలు పెద్ద పరిమాణంలో కనిపిస్తున్నాయి. దాని క్రింద ‘రిపబ్లిక్ ఆఫ్ చైనా’ అనే అక్షరాలు చాలా చిన్న సైజులో ఉన్నాయి. 

తైవాన్ ద్వీపం రాజ్యాంగం ప్రకారం అధికారిక పేరు ‘రిపబ్లిక్ ఆఫ్ చైనా’. 1945లో జపనీయులు తైవాన్‌ను చైనాకు అప్పగించారు. చైనా సివిల్ వార్‌లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. అనంతరం రిపబ్లిక్ ఆఫ్ చైనాను, దాని సంస్థలను తైవాన్‌కు విస్తరించారు. 

అప్పటి నుంచి చైనాతో రాజకీయ సంబంధాలను తైవాన్ తెంచుకుంది. పూర్తి స్థాయిలో ప్రజాస్వామిక దేశంగా ఏర్పడింది. అయితే అధికారిక పేరుగా ‘రిపబ్లిక్ ఆఫ్ చైనా’యే కొనసాగుతోంది. చైనా నుంచి రాజ్యాంగం, జెండా, ప్రభుత్వ సంస్థలను తెచ్చుకుంది. 

గత ఏప్రిల్ లో జరిగిన తైవాన్ పార్లమెంట్ సమావేశంలో ఒక సభ్యుడు మాట్లాడుతూ “విదేశాలలో మనలను చైనా వారుగా భావిస్తున్నారు. తైవాన్ పౌరులంగా పరిగణించడం లేదు. దానితో వివక్షతకు గురవుతున్నాము” అంటూ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. చైనాకు భిన్నంగా తమ ఉనికిని చాటుకోవడం కోసం తైవాన్ ఇప్పుడు ఆరాటపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.