కాళేశ్వరం ప్రాజెక్టు లొసుగులపై కేంద్రం ఆరా 

పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీయడంతో అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వకుండా ప్రాజెక్ట్ అంచనాలను కోట్లాది రూపాయలు పెంచుకొంటూ పోతున్న కేసీఆర్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. 

రెండు టిఎంసి నీటి వినియోగంపై అనుమతి పొంది, ఇప్పుడు మూడో టిఎంసి వినియోగంపై పనులు చేపట్టానని కేంద్రం నిలదీసింది. కాళేశ్వరం అదనపు‌ టీఎంసీ పనుల కింద కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టును ప్రతిపాదించలేదు. పాత ప్రాజెక్టుల కింద ఒక్క ఎకరాన్ని స్థిరీకరించడం లేదు. 

అలాంటప్పుడు రూ.26 వేల కోట్లకు పైగా ఖర్చుతో ఈ పనులు ఎందుకు చేస్తున్నారని కేంద్రం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మూడో టీఎంసీతో అదనపు ఆయకట్టు ఏమైనా సాగులోకి వస్తుందా?  ఇప్పటి వరకు ఎత్తిపోసిన నీళ్లతో పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టును  ఏమేరకు స్థిరీకరించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరింది.

పెరిగిన ప్రాజెక్టు వ్యయం అంచనాలను తమకు సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ కృష్ణా–గోదావరి బేసిన్‌‌ డైరెక్టర్‌‌ ఎం.రఘురామ్‌‌ మంగళవారం రాష్ట్ర ఇరిగేషన్‌‌ ఈఎన్సీకి లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2015 నాటి ప్రతిపాదిత రేట్లతో పెట్టుబడుల అనుమతి‌‌ తీసుకున్నారని, ప్రస్తుతం సవరించిన అంచనాలతో మళ్లీ అనుమతి ‌‌ తీసుకోవాలని రఘురామ్​ సూచించారు.

మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 98 రోజుల్లో 195 టీఎంసీలు ఎత్తిపోయడానికి 2015లో సాంకేతిక‌‌ అడ్వైజరీ కమిటీ అనుమతిచ్చిందని, ఇప్పుడు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయడానికి పనులు చేపడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఎత్తిపోసే మూడో టీఎంసీ నీళ్లతో కొత్త ఆయకట్టు ఏమైనా ఉందా? పాత ప్రాజెక్టుల కింది ఆయకట్టును స్టెబిలైజ్‌‌ చేసేందుకు ఈ పనులు చేస్తున్నారా? అనే వివరాలు ఇవ్వాలని కోరారు.

మూడో టీఎంసీ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమర్పించాలని స్పష్టం చేశారు. లింక్‌-4 నుంచి ఏడో లింక్‌ వరకు ప్రతిపాదించిన ఆయకట్టుకు గతంలోనే టీఏసీ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఇప్పుడు అదే ఆయకట్టుకు నీళ్లివ్వడానికే అదనపు‌ టీఎంసీ పనులు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది.

ఇదే విషయాన్ని కేంద్రానికి చెప్తే సాంకేతికంగా చెల్లుబాటు కాదు. కొత్తగా ఒక్క ఎకరం ఆయకట్టు లేనప్పుడు ఇంత భారీ వ్యయంతో ఎందుకు పనులు చేస్తున్నారని నిలదీస్తే ఏం చెప్పాలో పాలుపోని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకుంది.

అలాగే ప్రాజెక్టు లింక్‌-1, లింక్‌-4లో ప్రతిపాదిత ఆయకట్టు ఉన్నా దాదాపు రూ.70 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత కూడా ఒక్క ఎకరానికి ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోయారనే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.

కాళేశ్వరం నిర్మాణ వ్యయం రూ.80,190 కోట్లకు 2018లో టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ అనుమతినిచ్చింది. లింక్‌-1, 2లో పనుల వ్యయం భారీగా పెరగడం, మూడో టీఎంసీ పనులతో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.14 లక్షల కోట్లకు చేరింది. ప్రాజెక్టు పెరిగిన అంచనాలకు ఆమోదం పొందాలని జూన్‌లోనే సీడబ్ల్యూసీ రాష్ట్రానికి లేఖ రాసింది. దానికి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు.