జనాభా గణన ఈ ఏడాది ఉండదా!

జనాభా గణన మొదటి దశ, నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) నవీకరణ ఈ ఏడాది చేపట్టేందుకు అవకాశం ఉండే అవకాశాలు కనిపించడం లేదు. గత ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు షెడ్యూల్‌ ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. 

దేశంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘జనాభా గణన ప్రసుతానికి ముఖ్యమైంది కాదని. ఒక సంవత్సరం ఆలస్యం అయినా ఎలాంటి నష్టం ఉండదు’ అని అధికార వర్గాలు భావిస్తున్నాయి. 

భారత దేశ జనాభా గణన ప్రపంచంలోనే అతిపెద్ద పరిపాలనా, గణాంక అభ్యాసాల్లో ఒకటని, ఇందుకు 30లక్షల మంది సిబ్బంది అవసరం అవుతారని చెబుతున్నారు. కాగా, 2021లో జనాభా గణన, ఎన్‌పీఆర్‌ నవీకరణ మొదటి దశ ఎప్పుడు జరుగుతుందనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది మాత్రం కచ్చితంగా ఉండదని స్పష్టం చేస్తున్నారు.

మొదట నిర్ణయించిన మేరకు ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సి ఉంది. మార్చి నుంచి కరోనా విస్తరిస్తుండడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే లక్షలాది మంది సిబ్బంది జనాభా గణన కోసం ఇంటింటీకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలని ఉంటుందని, దాంతో వైరస్‌ ప్రబలే అవకాశం ఉందని, ‘సిబ్బంది ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని బలహీన పరచకూడదు’ అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

సాధారణంగా దేశంలో ప్రతి పదేళ్లకోసారి కేంద్రం జనాభా గణనను నిర్వహిస్తూ వస్తోంది. ఇంతకు ముందు షెడ్యూల్‌ ప్రకారం 1 మార్చి, 2021 జనాభా లెక్కల కోసం ఈ ఏడాదే గణన ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు ఏప్రిల్‌ 1న ప్రారంభించి, సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు పూర్తి చేయాల్సి ఉంది. 

దేశంలో కరోనా విజృంభణ, కట్టడి కోసం లాక్‌డౌన్‌ తదితర పరిణామాల నేపథ్యంలో కేంద్రం వాయిదా వేసింది. ఇంతకు ముందు 2011 జనాభా లెక్కలను ప్రకటించగా,  2010లో వివరాలు సేకరించారు.