పాటలు వింటూ, పాడేందుకు ఎస్పీ బాలు ప్ర‌య‌త్నం

కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కాస్త మెరుగైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎంజీఎం హాస్పిటల్‌ వర్గాలు తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. చికిత్సకు బాలు బాగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.
 
బాలు స్పృహలోకి వచ్చారని, ఆయన శ్వాస ప్రక్రియ బాగా మెరుగైందని వెల్లడించారు. ఇలాగే నిలకడగా ఉంటే మరో వారం రోజుల్లో ఎక్మో పరికరాన్ని తొలగించే వీలుందని తెలిపారు. 
 
ఇక, బాలు చికిత్స పొందుతున్న అత్యవసర విభాగం దిగువ అంతస్థులో ప్రతి రోజూ వేద పండితులు వేదపారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని బాలు చికిత్స పొందుతున్న గదిలో ఉన్న టీవీ తెరపై ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
 
“నాన్న‌ పాట‌లు వింటున్నారు. పాడేందుకు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయ‌న కోలుకుంటున్నార‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం. ఇది నేటి అప్‌డేట్‌. అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు” అని ఆయ‌న కుమారుడు చ‌ర‌ణ్ చెప్పుకొచ్చారు.   
 ఆయ‌న‌కు డాక్ట‌ర్లు ఎక్మోతో వైద్యం అందిస్తున్నార‌ని తెలిపారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని పేర్కొన్నారు.
 
 “నాన్నను చూసేందుకు నేను ఆస్ప‌త్రికి వెళ్లాను. నిన్న‌టికంటే నేడు ఎక్కువ సేపు మెళ‌కువ‌గా ఉన్నారు. నాతో ఏదో చెప్ప‌డానికి రాసేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ పెన్ను కూడా స‌రిగా ప‌ట్టుకునే శ‌క్తి లేక‌పోవ‌డంతో అది కుద‌ర‌లేదు. అయితే త్వ‌ర‌లోనే రాయ‌గ‌లిగి నాతో మాట్లాతారన్న న‌మ్మ‌కం ఉంది”  అని తెలిపారు.
 
కాగా కరోనా సోక‌డంతో ఎస్పీ బాలు ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. తొలుత ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉన్న‌ప్ప‌టికీ మ‌ధ్య‌లో కాస్త విష‌మించింది. రెండు మూడు రోజులుగా ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతుండ‌టంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.