మంచుకొండలపై గగనతల రక్షణ క్షిపణులు 

తూర్పు లఢక్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట చైనా హెలికాప్టర్ల కదలికలు పెరుగటంతో భారత బలగాలు కూడా అందుకు సన్నద్ధమవుతున్నాయి. ఎల్‌ఏసీ వెంట మంచుకొండలపై గగనతల రక్షణ క్షిపణులను మోహరించాయి. 
 
రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఇగ్లా ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ను కీలక స్థావరాల్లో మోహరించినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. ఈ క్షిపణులను సైనికులు భుజాలపై పెట్టుకొని పేల్చగలరు. సైన్యంతోపాటు వాయుసేన కూడా వీటిని వినియోగిస్తున్నది. ఆకాశంలో ఎగురుతున్న శత్రు విమానాలు, హెలికాప్టర్లను వీటితో తేలికగా పేల్చేయవచ్చు.
 
ఎల్‌ఏసీ వెంట బలగాల ఉపసంహరణకు  ఒకవైపు చర్చలు జరుగుతుండగానే ఇటీవల చైనా యుద్ధ హెలికాప్టర్లను తూర్పు లఢక్‌లో మోహరించింది. గల్వాన్‌ లోయ, పెట్రోలింగ్‌ పాయింట్‌-14తోపాటు పలు వ్యూహాత్మక ప్రదేశాల్లో చైనా హెలికాప్టర్లు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించాయి. 
 
దాంతో అప్రమత్తమైన భారత్‌ గగనతలాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చింది. శక్తిమంతమైన రాడార్ల ద్వారా అనుక్షణం నిఘా పెట్టింది. ఉపరితలంనుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను మోహరించింది. 
 
అత్యంత కీలకమైన లఢక్‌కు ఏడాదంతా సాఫీగా రాకపోకలు సాగించే రహదారి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాన భూభాగంతో లఢక్‌ను అనుసంధానిస్తూ ప్రస్తుతం రెండు రోడ్డు మార్గాలు ఉన్నాయి.
 
 జమ్ముకశ్మీర్‌లోని జోజిలా కనుమగుండా ఒకటి, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలి- లేహ్‌ మార్గం మరొకటి. అయితే ఈ మార్గాలు శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి దాదాపు ఆరు నెలలు మూసివేసే ఉంటాయి. 
 
దాంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడాదంతా రాకపోకలు సాగించేలా హిమాచల్‌ ప్రదేశ్‌లోని దార్చా నుంచి కార్గిల్‌ సమీపంలో ఉన్న జన్‌స్కర్‌ లోయగుండా నిమును కలుపుతూ లఢక్‌కు మరో రహదారిని ప్రభుత్వం నిర్మిస్తున్నది.