రెండో దశకు ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారు చేస్తోన్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌కు భారత్‌లో మంగళవారం నుంచి రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. ట్రయల్స్‌లో భాగంగా ‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌పై పుణెకు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ప్రయోగాలు నిర్వహించనుంది. 

కొవిషీల్డ్‌ భద్రత, దాని రోగ నిరోధక శక్తిని నిర్ణయించేందుకు పుణెలోని భారతి విధ్యాపీఠ్‌ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మనుషుల మీద రెండు, మూడో దశ ప్రయోగాలు నిర్వహించేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆగస్టు 3న ఎస్‌ఐఐకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా 17 చోట్ల 18 సంవత్సరాల వయసు పైబడిన 1600 మందిపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించనున్నట్లు ఎస్‌ఐఐ వర్గాలు వెల్లడించాయి. ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎస్‌ఐఐ బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.