సోషల్ మీడియా వినియోగం కారణంగా పిల్లలపై అనేక దష్ప్రభావాలు పడుతున్నాయి. ఈ దుష్ప్రభావాలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా ఆంక్షలు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. దీనిపై ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రశంసించారు. 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియాను నిషేధిస్తూ ఆస్ట్రేలియా తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో చెప్పారు. ఐటీ, సోషల్ మీడియా నియంత్రణలో ఆస్ట్రేలియా చట్టాల నుంచి భారత్ చాలా నేర్చుకుంటోందని మోదీ చెప్పారు.
ప్రధాని వ్యాఖ్యలు మన దేశంలోనూ ఇలాంటి నిబంధనలు రాబోతున్నాయనడానికి సంకేతంగా అంతా భావిస్తున్నారు. ఈ అంశంపై ఎస్ కృష్ణన్ మాట్లాడుతూ ఇతర దేశాలు సోషల్ మీడియా విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నాయో తాము అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియా దుర్వినియోగం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశమని స్పష్టం చేశారు. భారత్లోనూ పార్లమెంటరీ స్థాయీ సంఘాలతో సహా వివిధ వర్గాలు ఈ ముప్పుల గురించి చర్చించాయని తెలిపారు.
ఐరోపా సమాఖ్య (ఈయూ) వంటి దేశాలతో జరిపిన చర్చల్లోనూ ఈ ఆందోళనలు పదేపదే వ్యక్తమయ్యాయని చెప్పారు. ఆస్ట్రేలియా చట్టం ప్రకారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఎక్స్ వంటి ప్రధాన సోషల్ మీడియా వేదికలు పదహారేళ్లలోపు వినియోగదారులను నిరోధించడానికి వయసు నిర్ధారణ చర్యలు చేపట్టాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సదరు కంపెనీలకే జరిమానా విధిస్తారు కానీ, పిల్లలు లేదా వారి తల్లిదండ్రులను బాధ్యులను చేయరు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇలాంటి డిజిటల్ భద్రతా చర్యలవైపు మొగ్గుచూపుతున్నాయి. అమెరికాలో సైతం వ్యసనపూరిత అల్గారిథమ్లు, వయసు నిర్ధారణ వంటి అంశాలపై మెటా వంటి టెక్ దిగ్గజాలపై ఒత్తిడి పెరుగుతుంది.

More Stories
మణిపూర్లో 24 వేల మంది నిర్వాసితుల పునరావాసంపై సుప్రీం ఆదేశం
రాజస్థాన్లో విద్యార్థి సంఘ ఎన్నికల రద్దుపై ఎబివిపి ఆందోళన
జేపీఎస్సీ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తుకు దిగిన ఈడీ