కేరళ సచివాలయ అగ్నిప్రమాదంపై దుమారం

కేరళ సచివాలయ భవనంలో మంగళవారం జరిగిన స్వల్ప అగ్ని ప్రమాదం రాజకీయ దుమారం రేపుతున్నది. అక్రమ బంగారం రవాణా కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పునరాయి విజయన్  ప్రభుత్వం కీలక పాత్రలను మాయం చేసేందుకు ఈ నాటకం ఆడుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 
 
ఈ ఘటనలో కొన్ని కీలక పత్రాలు కాలి బూడిదైనట్లు అధికారులు వెల్లడించారు.  ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. సచివాలయం‌ రెండో అంతస్తులోని జనరల్‌ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) పొలిటికల్‌ సెక్షన్‌ నుంచి పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. 
 
మంటలను అదుపుచేసి కొన్ని పత్రాలను బయటకు తీశారు. కానీ, అప్పటికే కొన్ని మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అక్రమ బంగారం కేసులో ప్రసుత్తం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కార్యాలయ పరిశీలనలో ఉండడం గమనార్హం. 
 
 ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేరళ ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితాల గవర్నర్ అరిఫ్ మొహమూద్ ఖాన్‌ను కలిసి ఇందులో జోక్యం చోసుకోవాలని కోరారు. 
 
బంగారు అక్రమ రవాణా కేసులోని అన్ని ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ అగ్ని ప్రమాదం సంఘటన చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా త్వరలోనే ఎన్‌ఐఏ, ఈడీ సీఎంఓకు చేరుకుంటాయని తెలిసినందున ఫైళ్లు ధ్వంసమయ్యాయి అని విమర్శించారు.
 
మరోవైపు సచివాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా,  గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను ఇప్పటికే డిజిటలైజేషన్ చేశామని, పత్రాలను నాశనం చేశామనడం అర్ధరహితమని ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానించారు. ప్రమాద కారణాలపై తెలుసుకొనేందుకు ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసిన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.