జగన్ పారిశ్రామిక విధానంపై బిజెపి ఫైర్ 

జీవో నెంబరు 39 ద్వారా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వస్తున్న నూతన పారిశ్రామిక విధానం 2020-23 వల్లన రాష్ట్ర ప్రగతి మందగిస్తుంది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. నూతన పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేకపోవడంతో కొత్తగా పరిశ్రమలు రావని స్పష్టం చేశారు. 

ఈ విధానంలో లో ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఈ వర్గాలకు గత 2015-20 పారిశ్రామిక విధానంలో వున్న రాయితీలను తీసేశారని,  సబ్సిడీ శాతాన్ని 45 % నుండి 35 % తగ్గించారని ధ్వజమెత్తారు. 

 ఎస్సీ, ఎస్టీ బీసీల ప్రయోజనాల దెబ్బతీస్తూ, పారిశ్రామికాభివృద్ధికి ఆటంకంగా ఉన్న నూతన పారిశ్రామిక విధానాన్ని, పూర్తిగా ఉపసంహరించుకోవాలని, పాత విధానాన్ని కొనసాగిస్తూ, లబ్దిదారులకు ప్రయోజనాలు కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి కప్పుడు దీనిని పర్యవేక్షించాలని వీర్రాజు డిమాండ్ చేశారు.

గతంలో పరిశ్రమ పెట్టిన 6 నెలల్లో సబ్సిడి వచ్చేదని,  ఇపుడు 3సం.ల నుండి 5 సంల వరకు యూనిట్ విజయవంతంగా నడుస్తూ వుంటే సబ్సిడీ ఇస్తారుని గుర్తు చేశారు.  గతంలో రూ.75 లక్షలు గరిష్టంగా వున్న సబ్సిడీ రూ. 50 లక్షలకు తగ్గించారని, పైగా,  ప్రస్తుత నూతన పాలసీ ప్రకారం సర్వీస్ సెక్టర్ రంగానికి సబ్సీడి పూర్తిగా ఎత్తేశారని వివరించారు.

ఈ విధానంతో ‘ఉద్యోగ కల్పన’ అనే అంశానికి అవకాశం లేదని స్పష్టం చేశారు.  బ్యాంక్  లు ముందుకు రావని, మూడేళ్ల తర్వాత రాయితీలు ఇస్తామన్నా ఆచరణలో ఆరేళ్లు అవుతుందని చెప్పారు.   ప్రభుత్వానికి వచ్చే ఆదాయమూ తగ్గుతుందని, ఎ.పి.ఐ.ఐ.సి పైనా ప్రభావం చూపుతుందని చెబుతూ ప్లాట్లు కొనుగోలు ఔత్సాహికులు వెనుకంజ వేస్తారని తెలిపారు.

ప్రోత్సాహకాల కోసం ఎదురుచూసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇది నిరుత్సాహం కలిగిస్తోందని వీర్రాజు తెలిపారు.  పెట్టుబడి రాయితీ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు గతంలో గరిష్టంగా రూ.30 లక్షల రాయితీ ఉండగా ఇప్పుడు దానిని జనరల్ కేటగిరితో కలిపి రూ.20 లక్షల వరకే పరిమితం చేసి అన్యాయం చేశారని విమర్శించారు.

తీసుకున్న రుణంపై గతంలో పావలా వడ్డీ (3 శాతం) మాత్రమే వసూలుచేయగా ఇప్పుడు దానిని 9 శాతానికి పెంచారని విచారం వ్యక్తం చేశారు.  జనరల్ కేటగిరికి కరెంటు ఖర్చులో యూనిట్ కు గతంలో ఇచ్చిన రూపాయి రాయితీని మాత్రం అలాగే ఉంచారని, అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి రూపాయిన్నర రాయితీని ‘రూపాయి పావలా’కు కుదించారని తెలిపారు.

ఈ రాయితీలు కూడా పరిశ్రమ వర్గాలు సంవత్సరాల పాటు సమర్ధవంతంగా నిర్వహిస్తేనే అందిస్తామని ప్రభుత్వం నిబంధన విధించిందని పేర్కొన్నారు.  ఏ పరిశ్రమకు బ్రేక్ ఈవెన్ రావాలంటే రెండేళ్లు పడుతుంది. ఈ రెండేళ్లలో రాయితీలు అందితేనే పరిశ్రమ నిలబడుతుందని బిజెపి నేత గుర్తు చేశారు.
కాబట్టి మూడేళ్ల తరువాత ఇచ్చే రాయితీలు వచ్చినా, రాకపోయినా ఒకటే అని స్పష్టం చేశారు.

ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ పైనా ఈ పాలసీ ప్రభావం చూపుతుందని వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా పధకాలను కేంద్రం ప్రవేశ పెట్టిందని, ప్రతి బ్యాంకు బ్రాంచ్ ఇద్దరికీ తప్పనిసరిగా రుణాలు ఇవ్వాలని నిర్దేశించిందని గుర్తు చేశారు.

వీరిలో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ, మరొకరు వర్గాలకు అతీతంగా మహిళకు రూ.10 లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు ఎలాంటి పూచికత్తు లేని ఋణాలను ఇవ్వాలని పేర్కొంటూ 18 నెలల పాటు కేంద్రం మారటోరియం విధించిందని చెప్పారు.
గత ప్రభుత్వ పాలసీ కారణంగా ఈ పధకం 25 శాతం మాత్రమే అమలు జరిగిందని వీర్రాజు విచారం వ్యక్తం చేశారు.