అవినీతి నిర్మూలనకు దిశ తరహ చట్టం

లంచం తీసుకుంటూ పట్టుబడితే నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకునేందుకు దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు.  ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి. అవినీతి నిర్మూలనపై జరిపిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవినీతి చేయాలంటే భయపడే స్థాయికి రావాలని చెబుతూ అవినీతికి ఆస్కారం లేని విధానాలతో ముందుకు వెళ్లాలని  సూచించారు.

కొన్ని అవినీతి కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోంది అంటే అవినీతి నిరోధకత విషయంలో సీరియస్‌గా లేమనే సంకేతాలు వెళ్తున్నాయని జగన్ విచారం వ్యక్తం చేశారు. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత వెంటనే చర్యలు తీసుకునేలా విధానాలు ఉండాలని చెబుతూ  దీనికోసం అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించాలని ఆదేశించారు.

అలాగే 1902కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలు ఏసీబీకి చెందిన 14400కు బదిలీతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానంతో పాటు ఎమ్మార్వో, ఎండీవో, సబ్ రిజిస్ట్రార్‌, మున్సిపల్‌, టౌన్‌ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై దృష్టి పెట్టాలని సూచించారు. 

ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్‌ జరగాల్సిందేనని, టెండర్ విలువ రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాల్సిందేనని  సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్‌ ప్రాజెక్ట్‌తో పాటు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ల ప్రాజెక్ట్‌ల విషయంలో గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా స్పష్టం అయ్యిందని తెలిపారు.