రూ. 10 వేల కోట్ల పెట్టుబడితో రాయలసీమ అభివృద్ధి

రూ. 10 వేల కోట్ల పెట్టుబడితో రాయలసీమ అభివృద్ధి
రూ.10వేల కోట్ల పెట్టుబడితో రాయలసీమ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. ఖనిజ వనరులు, విస్తారమైన భూభాగం, మెరుగైన రహదారి, రైల్వే అనుసంధానం, పారిశ్రామిక అనుకూల విధానాలు రాయలసీమను పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా నిలబెడుతున్నాయని తెలిపారు. 

రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కడపలో నిర్వహించిన “రైజింగ్ రాయలసీమ” సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను వేగవంతంగా మంజూరు చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు.

తయారీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతున్నామని, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాష్ట్ర యువతకు విస్తృత ఉపాధి అవకాశాలను అందిస్తాయని ఆయన వివరించారు.

మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాయలసీమలో నీటి నిల్వలుతో పాటు అపారమైన ఖనిజ సంపద ఉందని, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొంటూ ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే రాయలసీమ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు లభిస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉందని పేర్కొన్నారు.

పరిశ్రమల మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు కీలకమని చెప్పారు.  పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు విద్యుత్, నీటి సరఫరా, రవాణా వంటి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

రాయలసీమలో పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో రాయలసీమను దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక, పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సమిష్టిగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.