బీహార్‌ ఎన్నికల్లో బీజేపీ కూటమిదే విజయం

రానున్న బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)కూటమిదే విజయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నడ్డా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీహార్ రాష్ట్ర బీజేపీ కార్యసమితిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడబోతున్నామని స్పష్టం చేశారు.

కలసికట్టుగా పోరాడి విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ లోకల్‌ ఫర్ వోకల్ ఇనీషియేటివ్‌లో భాగంగా ముజఫర్‌‌పూర్ నుంచి లిచీని, మధుబనీ నుంచి తేనెను ముందుకు తీసుకెళ్తూ స్వావలంబన దిశగా దేశాన్ని ఉరకలెత్తించాలని చెప్పారు.  కేంద్రం, రాష్ట్రస్థాయిలో బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ సభ్యులకు సూచించారు.

బీజేపీలోనే కాదు కూటమి పక్షాల్లోనూ విలువలు జోడించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు.  కోవిడ్‌ -19 నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పన, మాస్కులు, పీపీఈ కిట్లు, వస్తుసామగ్రి పంపిణీకి ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కోవిడ్‌ చికిత్సకు 12.50 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోజుకు 10 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని వెల్లడించారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 74 శాతంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ధాన్యాలు, పప్పుధాన్యాలు అందించామని వివరించారు.