ఢిల్లీ ఏయిమ్స్‌లో చేరిన అమిత్‌ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మంగళవారం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరారు. శ్వాసకోస సంబంధ సమస్యతో బాధపడుతూ ఆయన దవాఖానలో అడ్మిట్‌ అయ్యారు. ఇటీవల కరోనా పాజిటివ్‌గా పరీక్షించడంతో ఆయన గురుగ్రామ్‌లో మేదాంత దవాఖానలో చికిత్స తీసుకున్నారు. తాజాగా శ్వాసకోశ ఇబ్బందులు రావడంతో ఏయిమ్స్‌లో చేరారు. 

ఆగస్టు 2న కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. వైద్యుల సలహా మేరకు దవాఖానలో చేసి చికిత్స తీసుకున్నారు. ఈ నెల 14న నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో  నెగెటివ్‌ వచ్చినట్లు ఆయన ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. తాజాగా శ్వాసకోశ సమస్యలు ఎదురవడంతో ఏయిమ్స్‌లో చేరారు.

ఈ మేరకు ఏయిమ్స్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది. మూడు నాలుగు రోజులుగా అమిత్‌ షా అలసట, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారని హాస్పిటల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఆర్తి విజ్‌ తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, హాస్పిటల్‌ నుంచే పనిని కొనసాగిస్తారని పేర్కొన్నారు. 

కాగా, అమిత్‌ షా సోమవారం ఓ ప్రైవేటు దవాఖానలో సిటీ స్కాన్‌ చేసుకోగా, పరీక్షా ఫలితాల్లో ఛాతిలో ఇన్ఫెక్షన్‌ ఉందని తెలిసిందని, దీంతో ఆయన వైద్యుల సలహా మేరకు ఏయిమ్స్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఛాతి నిపుణుడు, ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పరిశీలనలో షా ప్రస్తుతం ఉన్నట్లు సమాచారం. కేంద్రమంత్రి 24గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంటారని తెలిసింది.