
ఈ రోజు రామ నామం జపం చేస్తున్న వాళ్లే ఆరోజు అయోధ్యలో నుంచి రామ్ లల్లా విగ్రహాన్ని తొలగించారని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. అయోధ్య రామాలయ భూమి పూజకు కాంగ్రెస్ నేత ప్రియాంక మద్దతు తెలిపడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.
‘కొందరు ఇప్పుడు రామ నామస్మరణ చేస్తున్నారు. వీళ్లే రామ్ లల్లా విగ్రహ తొలగింపునకు బాధ్యులు. నిర్ణీత ప్రదేశం నుంచి 200 మీటర్లు దూరంగా శిలాన్యాస్ చేయాలని వారు కోరుకున్నారు” అంటూ పేర్కొన్నారు.
“మేం అందర్ని పిలవాలనుకున్నాం. కానీ కరోనా కారణంగా కేవలం 200 మందిని మాత్రమే ఆహ్వానించాం. బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు (జేపీ నడ్డా) కూడా హాజరవ్వలేదు” అని తెలిపారు.
భగవాన్ రాముడు అందరి కోసం ఉన్నారని చెబుతూ ఆయన పేరును వాడుకొని సమాజాన్ని విడదీయాలని యత్నించకూడదని ఆదిత్యనాథ్ హితవు చెప్పారు. రాముడి ద్వారా ప్రజలను ఏకం చేయాలనే తాము అనుకున్నామని తెలిపారు.
ఇవ్వాళ కొందరు ఎవరైతే రామ నామాన్ని జపం చేస్తున్నారో వారు 1949, 1984 ఆ తర్వాతి సంవత్సరాల్లో తమ అభిప్రాయాలను గురించి ఆలోచించాలని ముఖ్యమంత్రి కోరారు. వాళ్లు ఇప్పుడు వేరే పరిభాషలో మాట్లాడుతున్నారని, ఇంతకుముందు వారు వేరేలా మాట్లాడారని ధ్వజమెత్తారు.
శ్రీరాముడ్ని ఎవరైతే ఇరుకైన మనుస్సుతో చూస్తారో వాళ్లే ఎన్నికల సమయంలో హిందూ ఓటర్లకు తమ మద్దతు తెలపడానికి ఆలయాలను సందర్శిస్తారని యోగి ఎద్దేవా చేశారు. తన కంటే ముందు యూపీకి చెందిన ఏ ఒక్క సీఎం కూడా అయోధ్యను సందర్శించలేదని గుర్తు చేశారు. ఈ దేవాలయ నగరంలో అడుగు పెట్టడానికి వాళ్లందరూ భయపడ్డారని విమర్శించారు.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!