యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020  

కరోనా వల్ల నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ యూఏఈ వేదికగా 2020 సీజన్‌ నిర్వహణకి భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దుబాయిలోనే ఈసారి టోర్నీ జరుగుతుందనే విషయాన్ని ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. 

దీంతో ఐపిఎల్ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెర పడింది. ఇక, దుబాయిలో జరిగే ఐపిఎల్ కోసం విస్త్రృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉండటంతో యూఏఈ వేదికగా ఐపిఎల్‌ నిర్వహణకి అనుమతి ఇవ్వాల్సిందిగా ఇటీవల కేంద్ర హోమ్‌, క్రీడల మంత్రిత్వ శాఖలకి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బిసిసిఐ) అభ్యర్థన పంపింది.

తాజాగా ఆ రెండు శాఖల నుంచి ఆమోదం వచ్చినట్లు బిసిసిఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఐపిఎల్‌ 2020 సీజన్‌కి తాము ఆతిథ్యమిస్తామని రెండు నెలల క్రితమే ఇసిబి ఓ ప్రతిపాదనని బిసిసిఐకి పంపింది. కానీ సెప్టెంబరు నాటికి భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని ఆశించిన బిసిసిఐ ఆ సమయంలో మౌనంగా ఉండిపోయింది.

అయితే దేశంలో ఇప్పటికీ పరిస్థితుల్లో అదుపులోకి రాకపోగా మరింతగా చేయి దాటిపోయాయి. దాంతో భారత్‌లో ఐపిఎల్‌ 2020 సీజన్‌ మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యమని భావించిన బిసిసిఐ తాజాగా ఇసిబి ప్రతిపాదనకి ఆమోదం తెలిపింది. తమకు బిసిసిఐ నుంచి మెయిల్‌ ద్వారా ఒక లేఖ వచ్చిందని ఇసిబి కూడా పేర్కొంది.

ఇక భారత ప్రభుత్వం అనుమతి రావడంతో యూఏఈలోనే ఐపిఎల్‌ జరగడం ఖాయం అయింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపిఎల్‌ 2020 సీజన్‌ మ్యాచ్‌లను నిర్వహించాలని బిసిసిఐ ఇప్పటికే ప్రాథమికంగా షెడ్యూల్‌ తయారు చేసింది. వైరస్‌ నేపథ్యంలో బయో-సెక్యూర్‌ వాతావరణంలో ఐపిఎల్‌ని నిర్వహించాలని బిసిసిఐ చూస్తోంది. 

ఆగస్టు 2న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) సమావేశమై పూర్తి షెడ్యూల్ ను ఖరారు చేయగలదని భావిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం ఫ్రాంచైజీలకు ఈ సీజన్ ఐపీఎల్ పై పూర్తి స్పష్టత వస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.