ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు 

సోమవారం నమోదైన కేసులతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత లక్ష కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. 

సోమవారం 43,127 మందికి కరోనా టెస్టులు చేయగా వారిలో 6,051 మంది కొవిడ్- 19 పాజిటివ్ నిర్ధారించారు. ఈ కేసులతో కలిపి 1,02,349కి కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 51,701 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో 49,558 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

ఏపీలో ఇప్పటివరకు 16,86,446 కరోనా టెస్టులు చేశారు. ఇక మరణాలు కూడా ఏపీని వణికిస్తున్నాయి. సోమవారం ఒక్క రోజే 49 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 1,090 మృతి చెందారు. 

ఎప్పటిలాగే ‘తూర్పు’న కరోనా విజృభిస్తోంది. తూర్పగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి పట్టిపిడిస్తోంది. ఈ రోజు అత్యధికంగా 1,210 కేసులు నమోదయ్యాయి. ఇక గుంటూరు జిల్లా కేసుల్లో రెండో స్ధానంలో ఉంది. 744కి కరోనా సోకింది. 

మరోవంక, రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు భయపెడుతున్నాయి. ప్రతిరోజు ఏదొక మూలన వైరస్‌తో ఎవరొకరు చనిపోతుండడం వణికిస్తోంది. ముఖ్యంగా మహమ్మారి ధాటికి వృద్ధులు అధికంగా బలైపోతున్నారు. అప్పటికే ఏదొక అనారోగ్యం ఉండడం, టెస్ట్‌ల్లో నిర్లక్ష్యం, ఆపై అప్పటికే వైరస్‌ సోకి పరిస్థితి ముదిరి అనేకమంది కన్ను మూస్తున్నారు.