మావోయిస్టుల కోసం డ్రోన్‌ కెమెరాలతో నిఘా

మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా  విశాఖ మన్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పది రోజుల వ్యవధిలోనే మూడు సార్లు ఎదురు కాల్పులు జరిగి, ఒక మావోయిస్టు చనిపోవడం, కొంత మంది గాయపడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గాయపడిన మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా కూంబింగ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే వంటి అగ్రనాయకులు తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. మరో వైపు వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు ఎటువంటి చర్యలకూ పాల్పడకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచారు.

చింతపల్లి మండలం అన్నవరం, రాళ్లగెడ్డ పోలీసు అవుట్‌ పోస్టుల పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. చింతపల్లి, జికె.వీధి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో పోలీసులు వాహనాలు, ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. 

జి.మాడుగుల మండలంలో 600 మంది పోలీసులు కూంబింగ్‌ చేస్తున్నారు. మరో వైపు మావోయిస్టు పార్టీ ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శి అరుణ అక్కకు ఆదివాసి అల్లూరి యువత పేరుతో పలు ప్రశ్నలను సందిస్తూ కరపత్రాలను విడుదల చేశారు. వారోత్సవాల తొలి రోజు మావోయిస్టుల అలికిడి ఎక్కడా కానరాలేదు.