రామాల‌య నిర్మాణంలో రెట్టింపు మార్పులు  

అయోధ్య‌లో 161 అడుగుల ఎత్తైన రామాలయ నిర్మాణం జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆల‌య వాస్తుశిల్పి చంద్ర‌కాంత్ సోంపురా తెలిపారు. మొద‌ట అనుకున్న ఆల‌య నిర్మాణంలో రెట్టింపు మార్పులు చోటుచేసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఆల‌య డిజైన్‌, నిర్మాణ శైలుల గురించి నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. 

అహ్మదాబాద్‌కు చెందిన వాస్తుశిల్పి రామాల‌యం నిర్మాణ చిత్రం త‌న‌ డ్రాయింగ్ బోర్డులో గ‌త‌ 30 సంవత్సరాలుగా ఉంద‌ని పేర్కొన్నారు. 1990లో మొదటిసారిగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అప్ప‌టి చీఫ్ అశోక్ సింఘాల్‌తో కలిసి అయోధ్యను సందర్శించినట్లు తెలిపారు.

అప్ప‌టి వివాదాస్పద ప్రదేశంలో సైనిక క్యాంప్‌లు ఉన్న రోజుల‌ను గుర్తుచేసుకున్నారు. ఆ స‌మ‌యంలో భూమిని కొలిచే ఎటువంటి పరికరాలు లేకుండా లోపలికి వెళ్ళవలసి వచ్చిందని చెప్పారు. కాలి అడుగులతో లెక్కించడం ద్వారా గర్భగుడి ఉండే ప్ర‌దేశ కోణాన్ని తీసుకున్న‌ట్లు చెప్పారు. 

రాముడి జ‌న్మించిన ప్ర‌దేశానికి వెళ్ల‌డం అదే మొద‌టిసారి. ఆ ప్ర‌దేశం ఖ‌చ్చితంగా ఓ వైబ్రేష‌న్‌ను క‌లిగిఉందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆగ‌స్టు 5వ తేదీన ఆల‌య నిర్మాణానికి భూమిపూజ జ‌ర‌గ‌నుంది. కోవిడ్ నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 200 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారు.

మొత్తంమీద ఆల‌య నిర్మాణంలో క‌ద‌లిక‌లు జ‌రిగినందుకు సోంపూరులు కాస్త ఉపశమనం పొందిన‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అప్ప‌టి డిజైన్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్న‌ట్లు తెలిపారు. జూలై 18 న రామాల‌య నిర్మాణానికి ఏర్ప‌డ్డ రామ‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సమావేశంలో ఈ కొత్త డిజైన్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు చెప్పారు.

ఆలయం కొత్త డిజైన్ గురించి మాట్లాడుతూ నూత‌నంగా రూపొందించిన ఈ కొత్త డిజైన్ తన పాత డిజైన్‌ను మరచిపోయేంత గొప్ప‌ద‌ని పేర్కొన్నారు. ఇది న‌గర శైలీలో నిర్మించబడుతుందని చెబుతూ గర్భగుడిపై ఆలయ టవర్ ఉంటుందని తెలిపారు. ఆలయ ప్రణాళికపై వివ‌రించేందుకు త‌న‌ కొడుకు, ఆర్కిటెక్ట్‌ ఆశిష్‌ను ఆగస్టు 5న అయోధ్యకు ఆహ్వానించినట్లు సోంపురా చెప్పారు.

కొత్త డిజైన్‌లో మూడు గోపురాలు జోడించబడ్డాయ‌ని తెలిపారు. ముందు ఒకటి ఇరువైపులా రెండు గోపురాలు ఉంటాయి. నిలువు వరుసల సంఖ్య 160 నుండి 366 వరకు పెరిగింద‌ని చెబుతూ మెట్ల వెడల్పు 6 అడుగుల నుండి 16 అడుగులకు విస్తరించచబడింద‌ని వివరించారు. అదేవిధంగా ఆలయ ఎత్తు 141 నుండి 161 అడుగులకు పెరిగిన‌ట్లు తెలిపారు. వైష్ణ‌వాల‌యాల శాస్ర్త ప్ర‌కారం గ‌ర్భ‌గుడి అష్ట‌భుజిగా ఉంటుంద‌ని చెప్పారు. సీత, లక్ష్మణ్, గణప‌తి, హనుమంతుడుతో పాటు ఇతర దేవతల కోసం మరో నాలుగు మందిరాలు ఈ సముదాయంలో భాగంగా ఉంటాయ‌ని

వివరించారు.  మొద‌ట్లో అనుకున్న‌ డిజైన్ నిమిత్తం 3 లక్షల‌ క్యూబిక్ అడుగుల ఇసుకరాయిని ఉపయోగించాల్సి ఉండ‌గా ఇప్పుడు దాన్ని రెట్టింపు చేయాల్సి ఉంటుందని అర్కిటెక్ట్‌ ఆశిష్ చెప్పారు.

మూడున్నర సంవత్సరాలలో ఆల‌య‌ నిర్మాణం పూర్తవుతుందని సోంపురాస్ అంచనా వేసినప్పటికీ, క‌రోనా మహమ్మారి కార‌ణంగా గడువు మరో 6 నుంచి 8 నెలలు పాటు పెర‌గ‌నున్న‌ట్లు తెలిపారు.  వీహెచ్‌పి ఆలయ భవనాన్ని ముగ్గురు కాంట్రాక్టర్లకు అవుట్‌సోర్సింగ్ ఇచ్చింది. కాగా ఇప్పుడు లార్సెన్ అండ్ టౌబ్రో ఆల‌య నిర్మాణం చేయ‌నుంది.

జూలై 18 న నిర్మాణ‌ స్థలాన్ని సందర్శించినప్పుడు ఎల్ అండ్ టి అప్పటికే ఆ భూమిని చ‌దును చేసి ఉంచింద‌ని తెలిపారు. సోంపూరాస్ నిర్మించిన 200 దేవాలయాలలో ఈ ఆలయం నిస్సందేహంగా త‌మ‌కు ప్ర‌త్యేక‌మైంద‌ని స్పష్టం చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కు సోమనాథ్ ఆలయం త‌మ‌కు మాన‌సికంగా ప్రత్యేకమైనదని చెబుతూ త‌మ కుటుంబం ఇప్పుడు ఈ రెండు దేవాలయాలతో మ‌మేక‌మైఉందని పేర్కొ‌న్నారు. వాస్తుశిల్పుల‌ కుటుంబంగా త‌మ‌కు ఇది ఆనందంతో పాటు గ‌ర్వంగా కూడా ఉంద‌ని తెలిపారు.