అమరావతి మరో నందిగ్రాం  అవుతుంది 

రాజధాని కోడం 200 రోజులకు పైగా ఆందోళన జరుపుతున్న అమరావతి ప్రాంత రైతులపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యాలను కొనసాగిస్తే ఆ ప్రాంతం మరో నందిగ్రాం అవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 
పోలీసులను ప్రయోగించి రైతులపై దాడులు జరిపించి ఆడవాళ్లు, చిన్న పిల్లలు అని లేకుండా.. విద్యార్థులు, వృద్ధులని లేకుండా లాఠీలతో కొట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే  సరిచేసి ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఈ విధంగా దౌర్జ్యన్యం జరపడం సరికాదని హితవు చెప్పారు.
‘ఇలాంటి భావోద్వేగాలు చాలా సున్నితంగా ఉంటాయి. బయటకు కనిపించవు. దెబ్బలు తినీ తినీ అవమానపడి ఉన్నారు. నందిగ్రాంలో వెయ్యి ఎకరాలకే అంత గొడవ జరిగితే.. ఇక్కడ ఇన్ని వేల ఎకరాలకు చిన్న సమస్య అని నిర్లక్ష్యంగా వదిలేస్తే ఇబ్బంది తప్పదు’ అని తేల్చిచెప్పారు
టీడీపీ, వైసీపీ ఆధిపత్య పోరులో రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని ఆనాడు అందరూ అంగీకరించారని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రకరకాల కారణాలు చెప్పి రాజధాని మారుస్తామనడం రైతులను వంచించడమే అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
వారితో ఎవరైనా కన్నీరు పెట్టిస్తే అది మలమల మాడ్చేస్తుందని వై వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జగన్‌ ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానిలు ఒక కలేనని కొట్టిపారవేసారు.
అధికారంలోకి వస్తే పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు చేస్తామని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పి ఉండాల్సిందని తెలిపారు. అప్పుడు రాజధాని అమరావతికి రైతులు అన్ని వేల ఎకరాలు భూమి ఇచ్చేవారు కాదేమోనని చెప్పారు.