ప్రపంచ ఆర్ధికం పుంజుకోవడంలో భారత్ ప్రముఖ పాత్ర 

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంలో భారత పాత్రం చాలా ప్రముఖమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారతదేశానికి చెందిన టెకీలు కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచానికి మార్గం చూపిస్తూనే ఉన్నారని చెబుతూ అలాంటి వారిని ఎవరు, ఎలా మరిచిపోగలరని ప్రశ్నించారు. 
 
‘‘ఇండియా గ్లోబల్ వీక్-2020’’ ని పురస్కరించుకొని ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ  భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని ప్రధాని ప్రకటించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
 
‘‘భారత దేశంలో పెట్టుబడులు పెట్టి, తమ ఉనికిని చాటుకోడానికి గ్లోబల్ కంపెనీలకు రెడ్ కార్పెట్‌ పరుస్తూ స్వాగతం పలుకుతున్నాం. ఈ రోజు భారతదేశం అందించే ఈ అవకాశాలను చాలా కొద్ది దేశాలు మాత్రమే అందిస్తాయి. రక్షణ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు అవకాశాలు వచ్చాయి.’’ అని ఆయన పేర్కొన్నారు. 
 
 ఈ కాలంలో పునరుజ్జీవనం గురించి మాట్లాడటం అత్యంత సహజమని, ప్రపంచ పునరుజ్జీవంతో పాటు భారత దేశ పునరుజ్జీవాన్ని అనుసంధానించడం కూడా సహజ ధోరణే అని ప్రధాని తెలిపారు.భారత్ విజ్ఞానానికి అధికార కేంద్రమని చెబుతూ తమ విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచేందుకు సదా సిద్ధంగానే ఉందని ఆయన ప్రకటించారు. 
 
భారతీయలు సహజ సంస్కర్తలని, సాంఘికంగా గానీ, ఆర్థికంగా గానీ వచ్చే సవాళ్లను అధిగమించిన చరిత్ర తమకుందని ఆయన ప్రకటించారు. భారత్ ఓ పక్క కరోనా మహమ్మారితో పోరాడుతూనే… మరోపక్క ప్రజల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడుతోందని పేర్కొంటూ  ఆరోగ్యం, ఆర్థికం రెండింటీపై ఫోకస్ పెట్టామని మోదీ  తెలిపారు.
 
భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచానికే ఆస్తి అని పేర్కొంటూ  అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరకు మందులు సమకూర్చుస్తున్న ఘనత భారత్‌దేనని ప్రధాని గుర్తు చేశారు.  కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ వైరస్‌పై ప్రపంచం సాగిస్తున్నపోరులో భారత్‌ భాగస్వామ్యం అయ్యిందని తెలిపారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీకి జరుగుతున్నఅంతర్జాతీయ ప్రయత్నాల్లో భారత ఫార్మా సంస్థలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.