కరోనా విషయంలో నిర్లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు ధ్వజమెత్తారు. కరోనా ను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆయ‌న ఆ దిశలో తెలంగాణ రాష్ట్రం పని చేయడం లేదని విమర్శించారు. 
 
తెలంగాణ ప్రభుత్వ తీరుపై బీజేపీ ముందు నుంచి పోరాడుతుందని చెబుతూ కరోనా మహమ్మారిపై కేంద్రం ముందు నుంచి హెచ్చరిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం పాటించాలని స్పష్టం చేశారు. ఐసిఎంఆర్ నిర్ణయాలను పొగడడమే కాదు, అమలు కూడా చేయాలని హితవు చెప్పారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ సమర్ధవంతంగా చేయాలన్నదే త‌మ డిమాండ్ అని ముర‌ళీధ‌ర్ రావు పేర్కొన్నారు.
 
కేంద్రములో మోడీ నాయకత్వంలో దేశం కోవిడ్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కుంటుందని మురళీధర్ రావు కొనియాడారు. పేద ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారిని పరిరక్షించుకుంటూనే, 5 ట్రిలియల్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 
 
పేద‌ల కోసం గ‌రీబ్ కళ్యాణ్ యోజన, గరీబ్ అన్న యోజన, గరీబ్ రోజ్ గార్ యోజన వంటి చర్యలు తీసుకొచ్చామని గుర్తు చేశారు.  వన్ నేషన్- వన్ మార్కెట్ , వన్ నేషన్- వన్ రేషన్ కార్డు వంటి విప్లవాత్మక నిర్ణయాలను కేంద్రం తీసుకుంటుందని వివరించారు. దేశ సరిహద్దులను కాపాడుకుంటూనే, దేశంలోని సమస్యలకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందని చెప్పారు.