లెహ్, శ్రీనగర్‌లో భారత యుద్ధ విమానాల చక్కర్లు  

డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే దీటుగా బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల ఘర్షణతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్, హెలికాప్టర్లు లడఖ్‌లోని లేహ్ ప్రాంతంలో శుక్రవారం చక్కర్లు కొట్టాయి. 

దాడి చేయగల సామర్థమున్న అమెరికా అపాచీ హెలికాప్టర్లను సైతం మోహరించారు. అంతేకాకుండా వైమానికదళానికి చెందిన కీలక అస్త్రాలైన సుఖోయ్30 ఎంకెఐ, మిరేజ్2000, జాగ్వార్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా అక్కడికి తరలించింది. ఏదైనా సందేశం వచ్చిన వెంటనే రంగంలోకి దిగేలా వాటిని సిద్ధం చేసి ఉంచారు.

ఈశాన్య లడఖ్‌లో సైన్యానికి మద్దతుగా వైమానిక దళం అందుబాటులో ఉండేలా సన్నద్ధమతున్నారు. లెహ్ ఎయిర్‌బేస్‌లో చినూక్ హెలికాప్టర్లను కూడా మోహరించారు. లోయల్లోకి వేగంగా సైన్యాన్ని చేరవేసేలా ఇవి ఉపయోగపడతాయి.

మధ్యతరహ ఎంఐ17వి5 ర్యాపిడ్ చాపర్లను కూడా రంగంలోకి దింపారు. ఇవి సైన్యానికి కావాల్సిన వస్తు సామాగ్రిని చేరవేయడంలో ఉపయుక్తంగా ఉంటాయి. ఇక లడఖ్ చుట్టుపక్కల ఉన్న టిబెట్ రీజియన్‌లోని లెహ్, శ్రీనగర్‌తో పాటు అవంతిపూర్, బరేలీ, అదమపూర్, హ ల్వారా (లుథియానా), అంబానాల, సిర్సా తదితర ఎయిర్‌బేసులలో కూడా దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి.

భారత్‌చైనా సరిహద్దుల్లో ఐటిబిపి బలగాలు సర్వసన్నద్ధంగాఉండాలని ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వైమానికదళ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా శుక్రవారం లెహ్, శ్రీనగర్‌లో వైమానిక స్థావరాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో వైమానిక శిబిరాల సన్నద్ధతను సమీక్షించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమైన క్రమంలో వైమానిక దళం యుద్ధవిమానాలను ఫార్వార్డ్ బేస్‌లకు కదలడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.