కరోనా చికిత్సకు ఫాబిఫ్లూ ఔషదం

భారత దిగ్గజ ఫార్మా కంపెనీ  గ్లెన్‌మార్క్   కరోనా చికిత్సకు ఉపయోగపడే ఔషధాన్ని విడుదల చేసింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ డ్రగ్స్‌పై గ్లెన్‌మార్క్‌ స్టడీ చేసింది. ఫవిపిరవిర్‌ను కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్నవారికి చికిత్స విధానంలో ఓరల్‌ డ్రగ్‌గా వినియోగించవచ్చని తేల్చింది.

దీనిపై మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఫాబిఫ్లూ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఇండియాస్‌ డ్రగ్స్‌ రెగ్యులరేటర్‌ (భారత ఔషధ నియంత్రణ సంస్థ) నుంచి అనుమతి కూడా లభించిందని పేర్కొంది. 

కాగా, దేశంలో త్వరలోనే ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం  సహాయం తీసుకుంటామని గ్లెన్‌మార్క్‌ చైర్మన్‌ గ్లెన్‌ సల్దన్హా ప్రకటించారు. ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ. 103 ఉంటుందని, వైద్యుల ప్రిస్కిప్షన్‌ ఆధారంగానే విక్రయాలు జరుపుతామని ఆయన తెలిపారు.

దీనిని కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న మధుమేహ, గుండెజబ్బుగలవారు కూడా వాడవచ్చని సూచించారు. నాలుగు రోజుల్లోనే ఫలితం కనిపిస్తుందని, వైరల్‌ లోడ్‌ను ఇది తగ్గిస్తుందని పేర్కొన్నారు. తమ క్లినికల్‌ ట్రయ్‌ల్స్‌లో పాజిటివ్‌ రిజల్ట్స్‌ వచ్చాయని గ్లెన్‌ సల్దన్హా వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, ఫవిపిరవిర్‌ను జపాన్‌ ఫుజి ఫిలిమ్స్‌ ఆధీనంలోని సంస్థ అయిన ఆవిగాన్‌ పేరుతో మొదట తయారుచేశారు. దీనికి 2014లో యాంటీ ఫ్లూ డ్రగ్‌గా వాడేందుకు అనుమతి లభించింది. 

మరోవంక, శనివారం దేశవ్యాప్తంగా మరో 14,516 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,048కి చేరింది. తాజాగా 375 మంది మృతి చెందడంతో మొత్తం మరణాలు 12,948 కి చేరాయి.