మోదీ మనసులో ఏదో ఆలోచన ఉండే ఉంటుంది 

భారత జవాన్ల వీరత్వం ఏమాత్రం వృథా పోదని ప్రధాని మోదీ అన్నారంటే ఆయన మనసులో ఏదో ఆలోచన ఉండే ఉంటుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి వి రామమాధవ్ చెప్పారు. ఆ ఆలోచన ఏందన్న విషయంలో కాస్త వేచి చూడాల్సిందేనని ఆయన సూచించారు.

వారి త్యాగం వృథా పోదు అని మోదీ అన్నారంటే కచ్చితంగా అది వృథా పోదని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు.   చైనా బలగాలు దేశ భూభాగంలోకి ప్రవేశించకుండా భారత బలగాలు అడ్డుకుంటున్నాయని, ఒక్క అంగుళపు భూమిని చైనా ఆక్రమింపజాలదని ధీమా వ్యక్తం చేశారు.

భారత దేశానికి చెందిన ప్రతి అంగుళాన్ని కాపాడే క్రమంలో 20 మంది భారత సైనికులు గాల్వాన్‌లో వీర మరణం పొందారని పేర్కొంటూ  అలా వారు బలిదానం కావడంపై తీవ్రమైన దుఃఖంతో పాటు కాస్తంత గర్వంగా కూడా ఉందని తెలిపారు.  

 అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను నెరపడం మన డీఎన్‌ఏలోనే ఉందని, అయితే సరిహద్దు భద్రత విషయంలో మాత్రం అత్యంత జాగరూకతతో ఉంటామని ప్రకటించారు. భారత సరిహద్దుల్లోకి ఎవరూ ప్రవేశించలేరని చెబుతూ చైనా అలా ప్రయత్నం చేసినపుడు మన సైన్యం వారిని అడ్డుకుందని గుర్తు చేశారు.

ఒప్పందాల్లో భాగంగా ఆయుధాలను ప్రయోగించరని ఉండడంతో మన సైనికులు నిరాయుధంగా వెళ్ళవలసి వచ్చినదని తెలిపారు. అందరితోనూ భారత్ సత్సంబంధాలనే కోరుకుంటోందని అయితే.. రక్షణ, సార్వభౌమత్వం విషయంలో మాత్రం నిరంతరం అప్రమత్తంగానే ఉంటామని రామ్ మాధవ్ స్పష్టం చేశారు.