రాహూల్ నిర్లక్ష్యపూరిత వైఖరికి  నిదర్శనం  

మన జవాన్లను ఆయుధాలు లేకుండానే రంగంలోకి దింపారని, అందుకే వారు అమరులయ్యారంటూ కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజీపీ మండిపడింది. 20 మంది జవాన్లను చైనా పొట్టనపెట్టుకున్న ఈ తరుణంలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం రాహూల్ నిర్లక్ష్యపూరిత వైఖరికి నిదర్శమని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఓ ఎంపీ అయి ఉండి రాహూల్ గాంధీ భాద్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన వాపోయారు. చైనా దురాగతంపైనే ప్రత్యేకంగా ప్రధాని మోదీ శుక్రవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారనీ, కనీసం అప్పటి వరకైనా రాహూల్ సంయమనం పాటించి ఉండాల్సిందని హితవు చెప్పారు.

దేశమంతా మన ఆర్మీకి, మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడితే, ప్రధాన ప్రతిపక్షం మాత్రం శత్రుదేశాలకు లబ్ది చేకూర్చేలా వ్యాఖ్యలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాహూల్ గాంధీ వ్యాఖ్యల్నే చైనా మనపైకి అస్త్రాలుగా వాడుకుంటోందని హెచ్చరించారు. 

ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారత ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ రాహూల్ వ్యాఖ్యానించడం అత్యంత భాద్యతారాహిత్యమని సంబిత్ పాత్రా విమర్శలు గుప్పించారు. ‘మీరు మోదీని విమర్శిస్తున్నారంటే ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరు విమర్శలు చేస్తోంది మోదీపై కాదు, మన దేశ నాయకుడిపై అన్నది తెలుసుకోండి’ అంటూ హితవు చెప్పారు.