కేంద్ర నిధులను పక్కదోవ పట్టిస్తున్న కేసీఆర్ 

తెలంగాణకు  వందల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజీ ని కేంద్ర ప్రభుత్వం అందిస్తే ఆ నిధులను ముఖ్యమంత్రి  కేసీఆర్ పక్క దోవ పట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్రంపై కేసీఆర్ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రం పథకాలను సొంత పథకాలుగా చెప్పుకుంటూ అహంకార పూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం నిధులను జేబులు నింపు కోవడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తున్నదని పేర్కొంటూ ఇంతటి దౌర్భాగ్యపు సీఎం ఈ కేసీఆర్ అని సంజయ్ విమర్శించారు.
ప్రధాన మంత్రిగా రెండో విడత సంవత్సర పాలన పూర్తయిన సందర్భంగా మోదీ దేశ ప్రజలకు రాసిన లేఖలను ప్రజల కు వివరించేందుకు రాష్ట్ర బీజేపీ  చేపట్టిన ‘ఇంటింటికి మోడీ సందేశం’ కార్యక్రమాన్నిముషీరాబాద్ బీజేపీ నియోజకవర్గం ఆఫీస్ నుంచి ప్రారంభిస్తూ రాష్ట్రంలో కరోనా చావులతో పాటు ఆకలి చావులు లేవంటే అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవేనని సంజయ్ స్పష్టం చేశారు.
కేంద్రం విధించిన లాక్ డౌన్ తోనే మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని బయటకు తిరగకుండా కట్టడి చేయగలిగామని, ఒకవేళ లాక్ డౌన్ లేకుంటే వారు బయట తిరిగితే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధి కి అంతా కేంద్రం నిధులేనని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని సంజయ్ ధ్వజమెత్తారు.
 గ్రామ పంచాయతీలకు కూడా కేంద్రం ఇచ్చిన 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఖర్చు చేయలేదని సంజయ్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం  చేసిన ఖర్చెంత? రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రప్రభుత్వ వైఫల్యం ఏమిటనేది గాంధీ హాస్పిటల్ కు వెళ్తే తెస్తుందని సంజయ్ చెప్పారు. కేసీఆర్ చేతకాని తనం వల్లే గాంధీ హాస్పిటల్లో డాక్టర్లపై  దాడులు జరుగుతున్నాయని విచర్మ వ్యక్తం చేశారు. డాక్టర్లు ఆందోళన చేస్తుంటే వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఈ నెల 17 వరకు ‘ఇంటింటిలకీ మోడీ సందేశం’ ‘ఇంటింటికి మోడీ సందేశం’ ద్వారా రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలను తమ పార్టీ కార్యకర్తలు కలిసి మోడీ లేఖలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంజయ్‌ చెప్పారు.