పాక్‌లో సైనిక శిక్షణ పొందిన పెహల్‌గామ్‌ ఉగ్రవాదులు

పాక్‌లో సైనిక శిక్షణ పొందిన పెహల్‌గామ్‌ ఉగ్రవాదులు

* ఉగ్రవాదుల రహస్య స్థావరం గుర్తింపు * జమ్మూ జైళ్లపై దాడులకు కుట్ర

పెహల్‌గామ్‌ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో మరో కీలక విషయం వెల్లడైంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌ లో మిలిటరీ శిక్షణ పొందినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పాకిస్థాన్‌ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ నుంచి ఈ శిక్షణ పొందినట్లు సదరు వర్గాలు తెలిపాయి. దర్యాప్తులో భాగంగా జైల్లో ఉన్న కొందరు అనుమానిత ఉగ్రవాదులను, ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌ను ప్రశ్నించగా ఈ విషయం వెల్లడైంది.పెహల్‌గామ్‌ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరైన హషీమ్‌ మూసా గతంలో పాకిస్థాన్‌ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌లో పారా కమాండోగా పనిచేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. తర్వాత అతను లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో చేరినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి అనేక ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. మూసా 2023లో భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది. 

అప్పటి నుంచి జమ్ము కశ్మీర్‌ ప్రాంతంలో అనేక ఉగ్రదాడుల్లో పాలుపంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది అక్టోబర్‌లో గందర్‌బల్‌ జిల్లాలో జరిగిన దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ దాడి సహా మొత్తం ఆరు ఉగ్రదాడుల్లో అతడు పాల్గొన్నట్లు సమాచారం. మూసా ప్రస్తుతం దక్షిణ కశ్మీర్‌లోని అడవుల్లో రహస్య ప్రాంతంలో దాక్కున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అతడి కోసం ఆపరేషన్‌ మొదలుపెట్టారు.

కాగా, ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. పేలుడు పదార్థాలైన ఐఈడీలు, వైర్‌లెస్ సెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం సురాన్‌కోట్‌లోని మర్హోట్ ప్రాంతం సురాన్‌తల్‌లో ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. 

అటవీ ప్రాంతంలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించారు. స్టీల్ బకెట్లలో అమర్చిన రెండు ఇంప్రూవైజ్డ్ పేలుడు పదార్థాలు (ఐఈడీ)లు, మూడు టిఫిన్ బాక్సుల్లో ప్యాక్ చేసిన ఐఈడీలను కనుగొన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సరిహద్దు జిల్లాలో పేలుళ్లు జరుపాలన్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసినట్లు చెప్పారు. 

అర కిలో నుంచి ఐదు కిలోల బరువుతో పేలేందుకు సిద్ధంగా అమర్చిన ఈ ఐదు ఐఈడీలను అక్కడికక్కడే నియంత్రిత పద్ధతిలో పేల్చి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల రహస్య స్థావరంలో రెండు వైర్‌లెస్ సెట్‌లు, ఐదు యూరియా ప్యాకెట్లు, ఐదు లీటర్ల గ్యాస్ సిలిండర్, ఒక బైనాక్యులర్, మూడు ఉన్ని టోపీలు, మూడు దుప్పట్లు, కొన్ని దుస్తులు, పాత్రలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

మరోవంక, పెహల్‌గామ్‌ దాడి దర్యాప్తులో భాగంగా చాలా మంది స్లీపర్‌ సెల్స్‌, ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లను, అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకుని జైళ్లలో పెట్టారు. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు గుర్తించారు. జైళ్లలో ఉన్న హైప్రొఫైల్‌ ఉగ్రవాదులను విడిపించుకునేందుకు భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. 

 
దీంతో జమ్ము జైళ్లలో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.  జమ్మూ జైళ్లతోపాటు శ్రీనగర్‌ సెంట్రల్‌ జైలు, కోట్‌ బాల్వాల్‌ జైళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా జైళ్లలో ఉన్నతస్థాయి ఉగ్రవాదులు, స్లీపర్‌ సెల్‌ సభ్యులు, ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లు ఉన్నారు. పలువురు హైప్రొఫైల్‌ ఉగ్రనాయకులు సైతం ఆయా జైళ్లలో నిందితులుగా ఉన్నారు. వారిని విడిపించుకునేందుకు జైళ్లపై దాడికి కుట్రపన్నినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయాజైళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జైళ్ల వద్ద పోలీసులు, భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.