ఆర్థిక నిపుణులతో బడ్జెట్ పై ప్రధాని మోదీ భేటీ!

ఆర్థిక నిపుణులతో బడ్జెట్ పై ప్రధాని మోదీ భేటీ!

వచ్చే ఏడాది పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నది. బడ్జెట్‌కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు, నిపుణులతో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతారు. 

ఈ సమావేశంలో సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్, సుర్జిత్ భల్లా, డీకే జోషి సహా ప్రముఖ ఆర్థికవేత్తలు సమావేశానికి హాజరయ్యారు.

ఇదిలా ఉండగా భారతదేశ 2024-25 ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో ప్రధాని సమావేశం నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 5.4 శాతానికి పడిపోయింది. దాదాపు రెండేళ్ల కనిష్ఠానికి చేరింది. ఆర్‌బీఐ, రేటింగ్‌ ఏజెన్సీల అంచనాల కంటే ఘోరంగా తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జిడిపి ఏకంగా 8.1 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. 

గడిచిన ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 6.7 శాతానికి పరిమితమైంది. ఈ రెండింటితోనూ పోల్చినా జీడీపీ భారీ తగ్గుదల నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు రేటింగ్‌ ఏజెన్సీలు కూడా 6శాతం ఎగువన వృద్ధి ఉండొచ్చని అంచనా వేయగా.. వాటి కంటే తక్కువగా పడిపోవడం గమనార్హం. జీడీపీ 7శాతం పెరుగుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనా వేయగా.. అంచనాలకు మంచి జీడీపీ పతనమైంది.

రాబోయే బడ్జెట్‌లో ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుందా? లేదంటే సంస్కరణలు తీసుకువస్తుందా? అనేది ఆసక్తి నెలకొన్నది.  జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ట్రంప్‌ భారత్‌, చైనా, బ్రెజిల్‌ సహా ఇతర దేశాల వస్తువులపై సుంకాలను పెంచనున్నట్లు హెచ్చరించారు.

మరో వైపు ఈ నెల 20న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఆర్థిక మంత్రి ప్రీ-బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. పంజాబ్‌, కేరళ సహా పలు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు కేంద్రం నుంచి ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు, మూలధనం వ్యయం కోసం 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాల కేటాయింపును పెంచాలని కేంద్రాన్ని కోరారు.