క్రెడిట్ కార్డ్ బకాయిలపై 30 శాతానికి పైగా వడ్డీ

క్రెడిట్ కార్డ్ బకాయిలపై 30 శాతానికి పైగా వడ్డీ

క్రెడిట్ కార్డు బకాయిలపై బ్యాంకులు 30 శాతానికి పైగా వడ్డీ వసూలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 16 ఏళ్ల నాటి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీఈడీఆర్‌సీ) తీర్పును పక్కన పెట్టింది. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎమ్ త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ధర్మాసనం కమిషన్ తీర్పు చట్టువిరుద్ధం అని గురువారం తేల్చిచెప్పింది. 

అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారాల్లో జోక్యం చేసుకోవడమే అని పేర్కొంది. అంతేకాకుండా ఆ తీర్పు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1949 ఉద్దేశానికి విరుద్ధం అని చెప్పింది. క్రెడిట్ కార్డు హోల్డర్లను మోసం చేయడానికి బ్యాంకులు ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. 

అంతేకాకుండా బ్యాంకులు, క్రెడిట్ కార్డు హోల్డర్ల మధ్య కుదిరిన ఒప్పందం నిబంధనలను తిరిగి రాయడానికి కమిషన్ కు ఎలాంటి అధికార పరిధి లేదని స్పష్టం చేసింది. ఏకపక్షంగా ఆధిపత్యం చెలాయించే లేదా అన్యాయమైన నిబంధనలు ఉన్న ఒప్పందాలను పక్కన పెట్టే, వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం మాత్రమే కమిషన్ కు ఉందని తెలిపింది. 

అయితే విధించే వడ్డీ రేటు, ఆర్బీఐ ఆదేశాల గురించి ఎప్పటికప్పుడు బ్యాంకులు క్రెడిట్ కార్డు హోల్డర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. వడ్డీ విధింపు అన్యాయంగా, ఏకపక్షంగా ఉండకూడదని సరైన సమయంలో పేమెంట్లు పూర్తి చేయడం, ఆలస్య రుసుం వంటి బాధ్యతలు, హక్కుల గురించి క్రెడిట్ కార్డు హోల్డర్లకు బ్యాంకులు అవగాహన కలిగించాలని ధర్మాసనం సూచించింది. 

క్రెడిట్ కార్డ్ సదుపాయాన్ని పొందే సమయంలో, వడ్డీ రేటుతో సహా అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతుల గురించి వినియోగదారులకు స్పష్టంగా తెలిసేలా బ్యాంకులు చూడాలని తెలిపింది. సంబంధిత బ్యాంకులు జారీ చేసిన నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండటానికి కస్టమర్లు అంగీకరించాలని సూచించింది.  క్రెడిట్ కార్డు నిబంధనలు ఫిర్యాదుదారులకు తెలిసిన తర్వాత లేదా క్రెడిట్ కార్డు జారీకి ముందు బ్యాంకులు ఆ వివరాలను వెల్లడించిన తర్వాత వడ్డీ రేటు సహా ఆ నిబంధనలను కమిషన్ పునఃపరిశీలించలేదని స్పష్టం చేసింది.