
మౌలిక వసతుల ప్రాజెక్టుల అమల్లో అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. టోల్ రుసుము వసూలు శాశ్వత ప్రక్రియ ఏమీ కాదని స్పష్టం చేసింది. దాన్ని నిరంతరం వసూలు చేస్తామంటే అది నిరంకుశత్వం కిందకే వస్తుందని తెలిపింది. ఈ ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనానికి ఉద్దేశించినవే తప్ప ప్రయివేటు సంస్థలు లాభాలు ఆర్జించడానికి కాదని తెలిపింది.
ప్రజానీకంపై భారం మోపుతూ అన్యాయంగా ఇతరులకు లాభాలు వచ్చేలా సహకరిస్తామంటే అనుమతించబోమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం వెలువరించిన తీర్పులో తెలిపింది. డిల్లీ- నోయిడా డైరెక్ట్ (డీఎన్డీ) ఫ్లై వేపై టోల్ రుసుము వసూలు విషయమై కుదిరిన రాయితీ ఒప్పందాన్ని్ 2016లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ నోయిడా టోల్ బ్రిడ్జి కంపెనీ(ఎన్టీబీసీ) సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.
విచారణ జరిసిన ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. అసలు రాయతీ ఒప్పందమే లోపభూయిష్టంగా ఉందని తెలిపింది. ఉత్తమ నిబంధన ఏమిటంటే ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే విధానాలు, నిబంధనలను ప్రభుత్వం రూపొందించాలి. అవి నిజంగా ప్రజలకు ప్రయోజనం కలిగించాలి. వాటి ద్వారా ఎవరూ అనుచిత లబ్ధి పొందకూడదు. ప్రజానీకానికి ఇబ్బంది పెట్టి ప్రజల ఆస్తి ద్వారా ఎవరూ అక్రమ లాభాలు పొందకూడదని ధర్మాసనం తెలిపింది.
అవసరమైన ప్రజా మౌలిక సదుపాయాలను కల్పించిందన్న కారణంతో ప్రజలు వందలాది కోట్ల రూపాయలు ఎన్టీబీసీఎల్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థలకు చెల్లించేలా చేశారు. రుసుము రూపంలో ఆ ఫ్లై వేకు అయిన ఖర్చును ఎన్టీబీసీఎల్ తిరిగి వసూలు చేసుకుంది. లాభాలు కూడా ఆర్జించింది. అందువల్ల ఇంకా ఫీజు/టోల్ వసూలు చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంలో తప్పేమీ లేదని పేర్కొంది. రాయితీ ఒప్పందంలోని 14వ ఆర్టికల్లో టోల్ను శాశ్వత ప్రాతిపదికన వసూలు చేసుకోవచ్చన్న అర్థం వస్తుండడంతో దాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో కూడా హైకోర్టు నిర్ణయంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ప్రజాప్రయోజనం అత్యధికంగా ఉండే ప్రాజెక్టులు చేపట్టే సమయంలో అధికారులు ఏకపక్ష వైఖరికి దూరంగా ఉండాలి. న్యాయమైన, పారదర్శకతతో కూడిన స్పష్టమైన విధానాన్ని అమలు చేయలని సూచించింది.
`ఈ కేసులో ప్రభుత్వం అలంటి ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. టెండర్ల జారీ, పోటీదార్ల నుంచి కాంపిటీటివ్ బిడ్స్ ఆహ్వానించడంలో ఏ చొరవ చూపించలేదు. ప్రాజెక్టు పనులు పూర్తయినప్పటికీ అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు జరిపేందుకు తగిన కేసే’ అని పేర్కొంది. యూపీ, నోయిడా, ఇతర అధికారులను తప్పుపట్టింది.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
24 శాతం పెరిగిన ఎంపీల జీతాలు
ముగ్గురితో వాణిజ్య ఒప్పందాలపై మాట్లాడుతున్నాం