ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా

ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. అంతకు ముందు ఆయన సభలో మాట్లాడుతూ ఈ సమావేశాలు మొత్తం 10 రోజులు జరిగాయని చెప్పారు. ఇంకా వివరించాలంటే 59 గంటల 55 నిముషాలు సమావేశం జరిగాయని ఆయన తెలిపారు.
 
ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించినట్లు వివరించారు. ఈ సభలో సభ్యులు అడిగిన 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితోపాటు మంత్రులు ఎనిమిది ప్రకటనలు చేశారని చెప్పారు. సభలో వివిధ అంశాలపై 120 మంది సభ్యులు ప్రసంగించారని పేర్కొన్నారు. 
 
ఈ సభలో రెండు లఘు చర్చలతో పాటు, మూడు ప్రభుత్వ తీర్మానాలను ఆమోదించారని గుర్తు చేశారు. ఇక ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగిందని, అదే విధంగా మూడు కమిటీలకు ఎన్నిక సైతం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ కమిటీలలో ఎన్నికైన సభ్యుల పేర్లను ఈ సందర్భంగా స్పీకర్ ప్రకటించారు. పీఏసీ కమిటీ విజేతలుగా నక్కా ఆనందబాబు, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామంజనేయులు, జయనాగేశ్వరరెడ్డి, కోళ్ల లలిత కుమారి, శ్రీరాంతాతయ్య, పులపర్తి రామాంజనేయులు, విష్ణుకుమార్ రాజు ఎంపికయ్యారు.

అలాగే అంచనాల కమిటికీ భూమా అఖిల ప్రియ, బండారు సత్యానందం, వాల్మీకి పార్ధసారథి, ఏలూరి సాంబశివరావు, నిమ్మక జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, సుధీర్ కుమార్లను, ప్రభుత్వ రంగ సంస్ధల కమిటీ విజేతలుగా అయితాబత్తుల ఆనందరావు, ఈశ్వరరావు, సత్యనారాయణ, గౌతు శిరీష్, కూన రవికుమార్, వర్ల కుమార్ రాజా, తెనాలి శ్రవణ్‌ కుమార్, వసంత కృష్ణ ప్రసాద్, రంగారావు ఎంపికయ్యారు. అదే విధంగా విశాఖ డెయిరీ అక్రమాలపై ప్రత్యేక సభా సంఘం వేయాలని అసెంబ్లీ నిర్ణయించిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సమావేశాల్లో 2024 -25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తోపాటు ఆ పార్టీ సభ్యులు డుమ్మా కొట్టారు. తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ ఏపీ స్పీకర్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోరారు.

ఎమ్మెల్యేల సంఖ్య బలం లేకుండా  ఆ హోదా కేటాయించ లేమంటూ వైసీపీ అధినేతకు స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని వైఎస్ జగన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదా కేటాయించని నేపథ్యంలో సభకు హాజరు కానని వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విధితమే.