లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి.. 492మంది దుర్మరణం

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి.. 492మంది దుర్మరణం
 
* హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ హతం!
 
లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భారీగా వైమానిక దాడులు జరిపింది. హిజ్బుల్లా గ్రూప్‌ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 492 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో 1645 మంది వరకు గాయపడ్డారని తెలిపింది. అక్టోబర్‌ 7 తర్వాత గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం అనంతరం మరోసారి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. 
 
దాడులకు ముందు ఇజ్రాయెల్‌ సైన్యం లెబనాన్‌లో ఉన్న ప్రజలకు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ప్రజలకు సూచించింది. బీరూట్‌తో సహా పలు ప్రాంతాల్లోని ప్రజలను ల్యాండ్‌లైన్ కాల్ సందేశాల ద్వారా హెచ్చరించినట్లు పేర్కొంది.  వైమానిక దాడి జరగక ముందే భవనాలను ఖాళీ చేయాలని సూచించింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని డజన్ల కొద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడికి దిగింది. 
 
మజ్దాల్ సేలం, హులా, తౌరా, క్లయిలే, హారిస్, నబీ చిట్, హర్బాటా సహా పలు ప్రాంతాల్లో ఐడీఎఫ్‌ వైమానిక దాడులు జరిపింది. మృతుల్లో మహిళలు, పిల్లలు, పారామెడికల్‌ సిబ్బంది ఉన్నారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐడీఎఫ్‌ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ బెకా వ్యాలీలో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతుందని.. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. 
 
ఇజ్రాయెల్ లెబనాన్‌లో వైమానిక దాడులు ప్రారంభించిందని.. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున దాడి చేయబోతున్నందున లెబనాన్ ప్రజలు తమ భద్రత కోసం హెచ్చరికలు చేసినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ సుమారు 300 కంటే ఎక్కువ హిజ్బుల్లా సైట్‌లను ధ్వంసం చేసింది. అయితే, ఇజ్రాయెల్‌, హిజ్బుల్లా గ్రూప్‌లను యుద్ధం అంచున నుంచి వెనక్కి వెళ్లాలే ప్రపంచ శక్తులు చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే, అక్టోబర్‌ 7 దాడుల వ్యూహకర్త, హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వార్‌ మృతి చెందినట్లు ఇజ్రాయేల్‌ దళాలు అనుమానిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా దళాలు అతడు సజీవంగా ఉండి ఉండకపోవచ్చని భావిస్తున్నాయి. కానీ, ఈ వాదనను బలపర్చే ఆధారాలేవీ వారి వద్ద లేవు. ఇజ్రాయేల్‌లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్‌ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. 
 
ఇజ్రాయెల్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ కూడా ఒకవేళ సిన్వార్‌ చనిపోయినా.. ఇప్పటివరకు బలపర్చే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని చెబుతున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆగస్టు మొదటివారంలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురైన తర్వాత.. తమ నేతగా సిన్వార్‌ను ప్రకటించారు. కానీ, ఆయన కూడా ఇజ్రాయేల్ దాడులో చనిపోయినట్టు కథనాలు రావడంతో వారికి పెద్ద ఎదురుదెబ్బే. 
 
కాగా, హమాస్‌ సొరంగాల వ్యవస్థను ఇజ్రాయేల్‌ సైన్యం తీవ్రంగా దెబ్బతీసింది. వీటిల్లో సిన్వార్‌ ఉన్నట్లు అనుమానించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇటీవల సెంట్రల్‌ గాజాలోని హమాస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌పై వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో సమీపంలోని పాఠశాల కూడా ధ్వంసమైంది. ఈ దాడిలో 22మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మృతుల్లో హమాస్‌ అధినేత ఉండొచ్చని ఇజ్రాయెల్‌ దళాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం సిన్వార్‌ మరణంపై ఇజ్రాయెల్‌ దళాలు దర్యాప్తు చేస్తున్నాయి.

ఇటీవల సౌత్‌ ఫ్రంట్‌ నుంచి లెబనాన్‌ ఉత్తర సరిహద్దు వరకు హింసాకాండ జరుగుతున్నదని.. తాము నిద్రపోవడం.. బాంబుల మోతతో మేల్కొంటున్నామని.. తమ జీవితాలు అలా మారిపోయాయని దక్షిణ లెబనీస్‌ మహిళ వఫా ఇస్మాయిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. లెబనాన్‌ దక్షిణ, తూర్పు భాగంలోని ప్రాంతాలతో పాటు రాజధాని బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాలు హిజ్బుల్లాకు పెట్టని కోటలుగా పేర్కొంటారు. 

దాడులకు ముందు లెబనీస్‌కు ఇజ్రాయెల్‌ నుంచి త్వరగా ఖాళీ చేయమని ఫోన్‌ సందేశాలు వచ్చాయని అధికారిక నేషనల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. లెబనాన్‌లోని ఒక శక్తివంతమైన రాజకీయ, సైనిక శక్తి అయిన హిజ్బుల్లా, ఇరాన్ కూడా మద్దతునిచ్చే పాలస్తీనా మిత్రపక్షం హమాస్‌కు మద్దతుగా లెబనాన్ సరిహద్దు వెంబడి ఇజ్రాయెల్ దళాలతో దాదాపు రోజువారీ యుద్ధంలో పాల్గొంటున్నట్లు వస్తున్నది.