కవిత బెయిల్ కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు

కవిత బెయిల్ కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు అయి తీహాడ్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు విన్పిస్తున్నారని గుర్తు చేశారు. 

కెసిఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారని,  కెసిఆర్ చెప్పిన వారికే రాష్ట్రంలో మంత్రి పదవులు, రాజ్యసభ పదవులు వస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ చెప్పినందుకే తెలంగాణ రాష్ట్రం నుంచి అభిషేక్ మను సింఘ్వీకి తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానం వచ్చిందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలని విమర్శించారు.

ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని సంజయ్ ప్రశ్నించారు. పదేపదే బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం చేసుకోబోతున్నారంటూ దుష్ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు బండారం బయటపడిందని ధ్వజమెత్తారు.  పెద్ద వకీలు అయిన సింఘ్వీ తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి అవుతున్నాడంటే తెలంగాణ ప్రయోజనాల కోసం కోర్టులో, పార్లమెంట్‌లో గట్టిగ వాదిస్తడని అనుకున్నా, తీరా చూస్తే లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వాలని వాదిస్తున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. 

ఇన్నాళ్ళు కేసీఆర్ కుటుంబ అవినీతిని బట్టబయలు చేస్తాం, జైలుకు పంపిస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఆ కుటుంబాన్ని ఎందుకు జైలుకు పంపలేదని నిలదీశారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నందుకే కాళేశ్వరం, డ్రగ్స్, మియాపూర్ భూములు, ఫోన్ ట్యాపింగ్ కేసులన్నీ అటకెక్కించారని బండి సంజయ్ ఆరోపించారు.