భవిష్యత్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో లాగానే ఆన్లైన్లో సభ్యత్వం నమోదు చేయించాలని సూచించారు. బీజేపీ సభ్యత్వ నమోదు మహోత్సవం రాష్ట్రస్థాయి కార్యశాల లో బుధవారం మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అన్ని వర్గాల్లో ఉందని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు సభ్యత్వ నమోదు ఎంతో దోహదపడుతుందని సూచించారు. ‘కుటుంబ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయి. బీజేపీ సిద్ధాంత పరంగా పనిచేస్తోంది. కార్యకర్తలు ఇష్టంతో సభ్యత్వాలు నమోదు చేయించాలి. బీజేపీ బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం కావాలి’ అని సూచించారు.
బీజేపీ సిద్ధాంత పరంగా పనిచేస్తోందని, క్రమం తప్పకుండా సభ్యత్వాలు నమోదు చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలు ఇష్టంతో సభ్యత్వాలు నమోదు చేయించాలని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని చెబుతూ అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిందని, 2024 సభ్యత్వ నమోదులో మన రికార్డును మనమే బ్రేక్ చేసుకోవాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఒక వైపు సభ్యత్వ నమోదు మరో వైపు రైతాంగ సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం కావాలని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో పోటీతత్వం ఉన్నా ప్రధానిగా మోదీ మూడోసారి గెలిచారని కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో 70 లక్షలకు పైగా ఓట్లు తెలంగాణాలో బీజేపీకి వచ్చాయని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ ఏ విధంగా ప్రజలను మోసం చేసిందో, అలాగే కాంగ్రెస్ కూడా మోసం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రుణమాఫీపై రైతులకు ఆశలు పెట్టి, 50 శాతం మంది రైతులకు కూడా మాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. ఏ గ్రామంలో కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని మండిపడ్డారు.
ఎన్నికల హామీలకు సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారని, రైతు రుణమాఫీని రేవంత్ రెడ్డి గందరగోళంగా మార్చారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ళపై ఒట్లు వేసిన సీరేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. రుణమాఫీపై పూర్తి వివరాలను ప్రజలు ముందు ప్రభుత్వం ఉంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రజా ఉద్యమాలకు సిద్ధం అవుతున్నామని ప్రకటించారు.
బీజేపీకి చెందిన అన్ని విభాగాలు ప్రజల సమస్యలపై పోరాడతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ ముక్తి దివస్’ కార్యక్రమం చేస్తామని వెల్లడించారు. ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి శ్రీమతి విజయ రహత్కర్ హాజరవగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
దేశంలోనే సుసంపన్న రాష్ట్రం తెలంగాణ
కశ్మీర్లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి