హైదరాబాద్‌‌లో కుండపోతగా వర్షం

హైదరాబాద్‌‌లో కుండపోతగా వర్షం
గ్రేటర్‌ హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్‌ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.  సోమవారం మధ్యాహ్నం మొదలైన వర్షం కొనసాగుతూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. 
 
సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రజలు కార్యాలయాల నుంచి ఇళ్లను చేరుకోలేకపోయారు. భారీ వర్షానికి పార్సీగుట్టలో కార్లు కొట్టుకుపోయాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి నీటిలో కొట్టుకుపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.  మరోవైపు వాతావరణశాఖ హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.  ఏదైనా సమస్య తలెత్తితే 040-21111111, 9000113667 నంబర్లకు కాల్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. పలుచోట్ల జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

మరోవైపు తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ కూడా తెలంగాణలో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశముందని తెలిపింది.

సోమవారం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. 

మంగళవారం ఉదయం కూడా నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్‌బి నగర్‌ నుంచి మియాపూర్‌ వరకు అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పలుచోట్ల మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మలక్‌పేట రైల్వే స్టేషన్‌ వద్ద ఆర్వోబీ నీట మునగడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. మలక్‌పేట రైల్వే స్టేషన్‌ నుంచి ముసారాంబాగ్‌, సంతోష్‌నగర్‌ వరకు, కోఠీ వైపు చాదర్‌ఘాట్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఉస్మానియా మెడికల్‌ కాలేజీవద్ద రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.