ఆస్తుల పంపకాలపైనే తెలుగు ముఖ్యమంత్రుల చర్చలు

ఆస్తుల పంపకాలపైనే తెలుగు ముఖ్యమంత్రుల చర్చలు
ఏపీ పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించేందుకు శనివారం హైదరాబాద్ లో సమావేశం అవుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొత్తం 10 అంశాలపై చర్చించనున్నారు. సాగునీటి సమస్యలపై చర్చించే అవకాశం కనిపించడం లేదు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్​లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. 
 
ఏపీ నుంచి  మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్​ లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్ధిక శాఖతో పాటు కీలక శాఖల కార్యదర్శులు హాజరుకానున్నారు. ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10 సంస్థల అస్తుల పంపకాలపై ఇరువురు సీఎంల మధ్య ప్రధానంగా చర్చ జరగనుంది. 
 
షీలా బీడే కమిటీ సిఫార్సుల ప్రాతిపదికగా ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిలు రూ. 7,200 వేల కోట్లు, ఏపీఎఫ్సీ అంశాలతో పాటు ఏపీ- తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై ప్రధానంగా చర్చకు రానుంది. అలాగే ఉద్యోగుల పరస్పర మార్పిడి పైనా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
 
 అలాగే వృత్తి పన్ను పంపకంపై కూడా ఇరువురు నేతలు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చ జరుగనుంది. హైదరాబాద్​లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించే అంశం కూడా ఏపి ప్రతిపాదించనుంది.

మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు నిల్వల ఉండిపోయాయి. విభజన పూర్తి కానీ ఈ సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ 8,000 కోట్లు ఉండగా గత 10 ఏళ్లుగా ఎవరూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడటంతో వీటిని వినియోగించుకోవడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 

 
9వ షెడ్యూల్‌లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఒక్క ఏపి జెన్కో విలువే రూ.2,448 కోట్లుగా నిర్ధారణ అయ్యింది. 10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల్లో రూ.2,994 కోట్ల నిధులు ఉన్నట్టు గుర్తించారు. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.1,559 కోట్లను తెలుగు రాష్ట్రాలు పంచుకున్నాయి. అయితే రూ.1,435 కోట్ల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పంచాయితీ తేలటం లేదు. చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపైనా సీఎంల మధ్య చర్చ జరగనుంది.