టీఎస్పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలు మళ్లీ వాయిదా

టీఎస్పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలు మళ్లీ వాయిదా
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్పీఎస్సీ) గ్రూప్‌-2 పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ సారి వాయిదాకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడే కారణం కావడం గమనార్హం. 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గత ఏడాది నోటిఫికేషన్‌(28/2022)ను జారీ చేయగా, 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

టీఎ్‌సపీఎస్సీ తొలుత ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో  గ్రూప్‌-2ను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు, రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వచ్చాయి. అప్పట్లో ఆందోళనలు ఉధృతమవుతున్న తరుణంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎ్‌సపీఎస్సీ ప్రకటించింది. 

నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్‌-2ను నిర్వహిస్తామని పేర్కొంటూ అందుకు ఏర్పాట్లను చేస్తోంది. అయితే, తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం ప్రకటన చేయడం, నవంబరు 3న ఎన్నికల నోటిఫికేషన్‌ ఉండడంతో టీఎ్‌సపీఎస్సీ పునరాలోచనలో పడింది. దీంతో మంగళవారం టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో సుదీర్ఘ సమావేశం జరిగింది.

అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో నామినేషన్లు, ఇతర పనుల కారణంగా సిబ్బందిని సమకూర్చలేమంటూ జిల్లాల కలెక్టర్లు టీఎ్‌సపీఎస్సీకి తెలిపారు. అదేవిధంగా ఎన్నికల విధులు, నగదు/బంగారం/మద్యం/తాయిలాల తరలింపుపై నిఘా పెట్టాలని, సరిహద్దు చెక్‌పోస్టుల్లో నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుందని, అభ్యర్థుల భద్రత, ఇతర అంశాల నేపథ్యంలో గ్రూప్‌-2 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు సాధ్యం కాకపోవచ్చంటూ ఎస్పీలు వివరించారు. 

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న టీఎ్‌సపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో ఆ పరీక్షలను నిర్వహిస్తామంటూ టీఎ్‌సపీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్‌  ఓ ప్రకటనను విడుదల చేశారు. కాగా, గ్రూప్‌-2 పరీక్ష తేదీల ప్రకటనపై టీఎ్‌సపీఎస్సీ తొందరపాటుపై అభ్యర్థులు మండిపడుతున్నారు.

ప్రశ్నపత్రాల లీకేజీతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దయినప్పుడు కూడా అప్పటికప్పుడు తొందరపాటు నిర్ణయాలను తీసుకుని, జూన్‌ 1న పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారని గుర్తుచేస్తున్నారు.  అంత స్వల్ప వ్యవధిలో పరీక్షలను నిర్వహించినా  బయోమెట్రిక్‌ తీసుకోకపోవడంతో హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ విషయంలో ఓఎంఆర్‌ షీట్ల సంఖ్య విషయంలో తొందరపాటుతో ఒక సంఖ్య, ఆ తర్వాత వెబ్‌నోట్‌లో మరో సంఖ్యను పేర్కొనడాన్నీ హైకోర్టు తప్పుబట్టింది. 

ఆగస్టు 29, 30న నిర్వహించాల్సిన గ్రూప్‌-2ను వాయిదా వేశాక కూడా ముందూవెనకా ఆలోచించకుండా నవంబరులో పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించినట్లు నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. నవంబరు చివర్, లేక డిసెంబరులో ఎన్నికలు జరుగుతాయని అప్పటికే స్పష్టత ఉన్నా గ్రూప్‌-2 పరీక్ష తేదీలను నవంబరులో ప్రకటించడం వల్ల ఇప్పుడు మరోమారు వాయిదా పడిందంటూ మండిపడుతున్నారు.