భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుడి అధ్యయనం కోసం చంద్రయాన్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఇటీవలే చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ను కూడా ప్రయోగించింది. ప్రస్తుతం ఆ స్పేస్క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలో ఉంది.
ఇక ఇప్పుడు ఇస్రో.. మరో చరిత్రకు శ్రీకారం చుడుతోంది. త్వరలో సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1 మిషన్ను చేపట్టనున్నది. ఆదిత్య ఎల్-1 మిషన్కు చెందిన ఫోటోలను సోమవారం ఇస్రో అప్డేట్ చేసింది. బెంగుళూరులో తయారైన ఆ శాటిలైట్ ఇప్పుడు శ్రీహరికోటకు చేరుకున్నది. సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1ను ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి.
కాగా, చంద్రుడిపై పరిశోధనల కోసం పయనమైన చంద్రయాన్–3 వడివడిగా ముందుకు సాగుతోంది. జులై 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–3.. సోమవారంతో నెల రోజులు పూర్తి చేసుకుంది. మరో 10 రోజుల్లో జాబిల్లిపై అడుగుపెట్టనుంది.
ఈ నేపథ్యంలో చంద్రుడికి స్పేస్ క్రాఫ్ట్ మరింత దగ్గరైంది. చంద్రయాన్–3 కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. దీంతో చంద్రుడుకి, వ్యోమనౌకకు మధ్య దూరం మరింత తగ్గింది.
తదుపరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను 16వ తేదీన ఉదయం 8.30కి చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. తద్వారా అంతరిక్ష నౌక.. చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరనుంది. తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ వేరుపడనుంది. ఆ తర్వాత ఈనెల 23న చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది. అంతా సజావుగా జరిగి, సాఫ్ట్ ల్యాండింగ్ జరిగితే.. రోవర్ తన పని ప్రారంభించనుంది.
More Stories
నేటి నుంచి నూతన డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు
సినిమా థియేటర్లలో లోక్సభ ఎన్నికల ఫలితాలు
అగ్నిగోళంగా మారిన ఉత్తరాది.. నాగ్పూర్లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత