ఒకే దేశం.. ఒకే ఎరువు అనే కాన్సెప్ట్ కింద భారత్ బ్రాండ్ పేరుతో రేపటి నుంచి ఎరువుల సరఫరా అమలులోకి రాబోతున్నదని ఆయన ప్రకటించారు. తెలంగాణలో సుమారు 4 వేల ఎరువుల రిటైల్ షాపులని ఆ విధంగా మారుస్తున్నట్లు తెలిపారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరిగాయని చెబుతూ తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిమొట్లు, కిసాన్ సమ్మాన్ యోజన లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నదని గుర్తు చేశారు.
నేడు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిందని పేర్కొంటూ రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎరువుల రిటైల్ షాపులను ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా రేపటి నుంచి మార్చబోతున్నదని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎరువుల కోసం ఒక దగ్గరికి, భూసార పరీక్షలకు ఒక దగ్గరకు.. ఇలా అనేక చోట్లకు వెళ్లాల్సి వస్తున్నదని, అలా కాకుండా రేపటి నుంచి రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు.. కిసాన్ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో రైతులకు అందుబాటులో ఉంటాయని, భూసార పరీక్షలు, సీడ్ టెస్టింగ్ సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అప్గ్రేడేషన్, అవగాహన కిసాన్ కేంద్రాల ద్వారా కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. రైతులకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర పథకాలపై ఈ కేంద్రాలు అవగాహన కల్పిస్తాయని చెప్పారు. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత నీమ్ కోటెడ్ యూరియా సరఫరా చేయడంతో యూరియా బ్లాక్ మార్కెట్ సమస్య పోయిందని, నేల నాణ్యత పెరిగిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
రేపటి నంచి నీమ్కోటెడ్ యూరియాతోపాటు సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా దేశమంతా రాబోతున్నదని కేంద్ర మంత్రి వెల్లడించారు. 14వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు కూడా రేపు ఉదయం ప్రధాని 8.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తారని తెలిపారు. తెలంగాణలో సుమారు 39 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడనున్నాయని చెప్పారు.
ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్(ఎఫ్పీవో)లను ఓపీడీసీ పరిధిలోకి తీసుకొచ్చ, రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ నెట్వర్క్ పెంచేందుకు రేపు ప్రధాని కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు. ఒకప్పుడు యూరియా కోసం చెప్పులు క్యూలోపెట్టేవారు, లాఠీ చార్జీలు జరిగేవని పేర్కొంటూ ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కొరత తీరిందని చెప్పారు.
కిసాన్ సేవా కేంద్రాల్లో అన్ని రకాల వ్యవసాయ పనిమొట్లు.. అమ్మకానికి అందుబాటులో పెట్టడం జరిగిందని చెబుతూ జిల్లా స్థాయిలో డీలర్ల వద్ద పురుగుమందులు పిచికారీ చేసే డ్రోన్లను అందుబాటులో పెట్టబోతున్నామని తెలిపారు. సీడ్ టెస్టింగ్తోపాటు, వ్యవసాయానికి ఉపయోగించే వాటర్ను కూడా టెస్టింగ్ కూడా దేశంలో మొదటిసారి రేపటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నామని పేర్కున్నారు.
పంటల భీమా పథకం పట్ల బ్యాంకులను, రైతులను సమన్వయం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నడుస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు.
రైతుల ఇబ్బందులు, సమస్యలపై ఒకరికొకరు తెలుసుకునేందుకు ‘కిసాన్ కి బాత్’ రైతుల గ్రూప్ మీటింగ్ రేపటి నుంచి అమలు చేయబోతున్నామని చెప్పారు. ప్రతి నెల రెండో అధివారం కిసాన్ కి బాత్ ఉంటుంది.
కిసాన్ సేవా కేంద్రం పరిధిలో ఉండే రైతులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు వాతావరణ, వ్యవసాయ, మార్కెట్ అప్డేట్లు అందులో పంపే కార్యక్రమానికి రేపటి నుంచి కేంద్రం అమల్లోకి తీసుకురానుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినా మోదీ ప్రభుత్వం భారతదేశంలో గత అనేక సంవత్సరాలుగా ఎరువుల ధరలు పెంచకుండా రైతులకు అందిస్తున్నదని చెప్పారు. 45 కిలోల యూరియా బస్తాను రైతుకు రూ.265కు ఇస్తున్నది. కానీ దాని అసలు ధర రూ. 2503. అంటే దాదాపు రూ. 2236 కేంద్రం సబ్సిడీగా భరిస్తున్నది.
More Stories
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణ మంత్రివర్గ సమావేశంకు ఈసీ అనుమతి
కేజ్రీవాల్ నిరసన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత