లిక్కర్ స్కాంలో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా, నిన్నటి వరకు జైల్లో ఉండి, ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు గురువారం సిబిఐ స్పెషల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ ఈడీ సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం సంచలనంగా మారింది. 

ఈడీ దాఖలు చేసిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ పిటీషన్ ను కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదే కేసులో గతంలోనే ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబు సైతం అప్రూవర్ గా మారారు. శరత్ చంద్రారెడ్డి. ప్రముఖ ఫార్మాకంపెనీ అరబిందో ఫార్మాకు డైరెక్టర్ గా ఉన్నారు. గత ఏడాది, నవంబర్ 11వ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనను  ఈడీ అరెస్ట్ చేసింది. 

లిక్కర్ లైసెన్సుల రేట్లు ఫిక్స్ చేయడంలో శరత్‌‌‌‌ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది. స్కామ్‌‌‌‌లో శరత్‌‌‌‌ చంద్రారెడ్డిని కింగ్‌‌‌‌పిన్‌‌‌‌గా పేర్కొంది. ఈ కేసులో నిందితులైన విజయ్‌‌‌‌నాయర్‌‌‌‌‌‌‌‌, సమీర్ మహేంద్రుతో కలిసి రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు ఆధారాలు సేకరించింది.

శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్ గా కొనసాగుతున్న ట్రైడెంట్, ఆర్గోనామిక్స్, అవంతిక కాంట్రాక్టర్స్‌‌‌‌ కంపెనీలు ఢిల్లీలో రెండు కంటే ఎక్కువ రిటైల్ జోన్స్ నిర్వహిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో నిందితుడైన సమీర్ మహేంద్రు కంపెనీ ఇండో స్పిరిట్ లో శరత్ చంద్రారెడ్డి పెట్టుబడులు పెట్టారు. 

ఐదు రిటైల్ జోన్స్ శరత్‌‌‌‌ చంద్రారెడ్డి కంట్రోల్‌‌‌‌లో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. తమకు అనుకూలంగా పాలసీ రూపొందించడం కోసం జరిగిన ఆర్థిక లావాదేవీల్లో 30 శాతం ట్రైడెంట్ గ్రూపు కంపెనీల నుంచే జరిగినట్లు ఆధారాలు సేకరించిందని సమాచారం.

 రిటైల్ వ్యాపారులకు లైసెన్సులు ఇప్పించేందుకు శరత్ చంద్రారెడ్డి దాదాపు రూ.64.35 కోట్ల మనీలాండరింగ్‌‌‌‌ కు పాల్పడ్డారని గుర్తించింది. కాగా, ఈ కేసులో మొత్తం 34 మంది నిందితులు 140 ఫోన్లు మార్చారు. లిక్కర్​ స్కాం వెలుగులోకి రావడంతో ఫోన్లు మార్చారు. సెల్‌ ఫోన్లు మార్చడం కోసం రూ.1.20 కోట్లు ఖర్చు చేశారు.